శామీర్పేట, ఫిబ్రవరి 9: నాటు తుపాకీతో బెదిరించి తనకు రావాల్సిన మొండి బకాయిలు వసూలు చేసుకునేందుకు పథకం వేసిన ఓ వ్యక్తి పోలీసులకు పట్టుబడ్డాడు. శామీర్పేట పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో పేట్బషీర్బాగ్ ఏసీపీ రామలింగరాజు వివరాలను వెల్లడించారు. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం కర్కపట్ల గ్రామానికి చెందిన బిమరి శ్రీకాంత్ చదువు పూర్తి చేసి.. బ్యాంక్ లోన్ సహాయంతో జేసీబీ కొనుగోలు చేశాడు.
అతడి జేసీబీతో పనులు చేయించుకున్న కస్టమర్లు సరిగా డబ్బులు ఇవ్వలేదు. పాత బకాయిలు కూడా రాలేదు. దీంతో ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. ఎలాగైనా డబ్బులు వసూలు చేసి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలని శ్రీకాంత్ నిర్ణయం తీసుకున్నాడు. తన వద్ద జేసీబీ డ్రైవర్గా పనిచేస్తున్న రాజస్థాన్కు చెందిన సుమున్ (ఉద్దెమర్రి వైన్స్ వద్ద జరిగిన దోపిడీ కేసులోని నిందితుడు) తో బకాయిల వసూళ్లు, ఆర్థిక ఇబ్బందుల గురించి చెప్పాడు.
బెదిరించి బకాయిలు వసూలు చేసుకుంటాను, నాటు తుపాకీ ఇప్పించాలని కోరాడు. దీంతో సుమున్, అతడి స్నేహితుడైన నాసిర్ (ఇతను కూడా వైన్స్ వద్ద జరిగిన దోపిడీ కేసులో నిందితుడు) ద్వారా రూ.25 వేలకు రాజస్థాన్ నుంచి నాటు తుపాకీ, నాలుగు రౌండ్ల బుల్లెట్లు తెప్పించి శ్రీకాంత్కు ఇచ్చారు. నాలుగు రౌండ్ల బుల్లెట్ల నుంచి మూడు రౌండ్ల బుల్లెట్లను శ్రీకాంత్ ప్రాక్టీస్ కోసం వాడాడు. ఒక బుల్లెట్ మాత్రమే అతడి వద్ద ఉంది. అయితే, వైన్స్ వద్ద జరిగిన దోపిడీ కేసులో నిందితులైన ఇద్దరు సుమున్, నాసిర్ పట్టుబడిన విషయం తెలిసిందే. వీరిని విచారించగా శ్రీకాంత్కు నాటు తుపాకీ ఇచ్చిన విషయం బయటపడింది.
శ్రీకాంత్ను బుధవారం సీఐ సుధీర్కుమార్, డీఈ లక్ష్మీనారాయణరెడ్డి బృందం అదుపులోకి తీసుకుంది. అతడి వద్ద నాటు తుపాకీ, 1 బుల్లెట్ స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు శ్రీకాంత్ ఎవరినీ బెదిరించలేదని, మూడు బుల్లెట్లు కూడా ప్రాక్టీస్ కోసం వాడినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. శ్రీకాంత్ను అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. ఇదిలా ఉండగా.. జేసీబీ, టిప్పర్ వాహనాల యజమానులు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని ఏసీపీ రామలింగరాజు పత్రిక ముఖంగా కోరారు. ఇతర ప్రాంతాల వారికి ఉద్యోగ అవకాశం కల్పించే ముందు వారి వివరాలు తెలుసుకోవాలని సూచించారు.