శేరిలింగంపల్లి, డిసెంబర్ 17: జాతీయ నూతన విద్యా విధానాన్ని అన్ని విద్యా సంస్థల్లో అమలు చేయాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో రెసోనెన్స్ విద్యాసంస్థలకు చెందిన ‘రెసోఫెస్ట్-2023’ ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన వెంకయ్యనాయుడు చదువులో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ దేశాభివృద్ధిలో యువత కీలకపాత్ర పోషించాలన్నారు. మనిషి జీవితంలో విద్య కీలకమైనదని, మానవాళి మనుగడ విద్యతోనే సాధ్యమన్నారు. కష్టపడేతత్వం, క్రమశిక్షణ, సమయపాలన సుగుణాలను అలవరుచుకున్నప్పుడే చదువులో రాణిస్తారన్నారు. ఆంగ్లం ఇతర భాషల్లో ప్రావీణ్యంతో పాటు మాతృభాషను మాత్రం మరవద్దని కోరారు.
జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా కన్నతల్లి, మాతృభాష, జన్మభూమిలను మరచిపోవద్దన్నారు. టెక్నాలజీ అవసరమైనప్పటికీ మితిమీరిన వినియోగం అనర్థాలకు దారితీస్తుందని, చదువులపై ప్రభావం చూపే సెల్ఫోన్లు, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా భారతీయ సంస్కృతి సాంప్రదాయలకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. భారతీయ వారసత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
దేశంలోని అన్ని విద్యాసంస్థల్లోనూ జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయాలని పేర్కొన్నారు. ప్రముఖ హాస్యనటుడు, పద్మశ్రీ బ్రహ్మానందం మాట్లాడుతూ చదువుతోనే మనిషికి సార్థకత లభిస్తుందన్నారు. ఏదైనా సాధించాలనే తపనతో పాటు అలుపెరగని ఆత్మైస్థెర్యంతో చేసే ప్రయత్నం విజయాలకు చేరువ చేస్తుందన్నారు. రెసోనెన్స్ విద్యాసంస్థల డైరెక్టర్ పూర్ణచంద్రరావు, మేనేజింగ్ డైరెక్టర్ ఆర్కే వర్మలతో పాటు పలువురు విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.