కుత్బుల్లాపూర్, నవంబర్26: నియోజకవర్గంలోని లోత ట్టు ప్రాంతాల్లో నాలాల సమస్యలు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం రూ.95 కోట్లు విడుదల చేసిందని, పనులను త్వరగా ప్రారంభించాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అధికారులకు సూచించారు. శుక్రవారం పేట్ బషీరాబాద్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇరిగేషన్, జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ సెక్షన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్షాకాలంలో తలెత్తే వరద సమస్య నుంచి ప్రజలకు విముక్తి కల్పించేలా నాలాలను అభివృద్ధి చేయాలని సూచించారు. ఫాక్స్ సాగర్ నుంచి వచ్చే నాలా తూమ్ కాలువ, కోల్ నాలా, వెన్నెలగడ్డ చెరువు నాలాలకు ఎస్ఎన్డీపీ కింద రూ.95 కోట్ల నిధులు మంజూరయ్యాయన్నారు. ముంపు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, వరద నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గతంలో వర్షాలకు అనేక ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడ్డారని, అలాంటి సమస్య తిరిగి రాకుండా ఇరు శాఖల అధికారులు సమన్వయంతో దృష్టి సారించాలని తెలిపారు. నాలా నిర్మాణానికి సంబంధించిన మార్కింగ్ పనులు వేగంగా చేపట్టి, సకాలంలో పూర్తి చేసి, వరద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా పని చేయాలన్నారు. కార్యక్రమంలో ఇంజినీరింగ్ ఎస్ఈ చెన్నారెడ్డి, ఈఈ కృష్ణచైతన్య, ఇరిగేషన్ ఈఈ నారాయణ, డీఈ నరేందర, ఏఈ రామారావు, టౌన్ ప్లానింగ్ డీసీపీ రఘునందన్, సెక్షన్ ఆఫీసర్ ప్రభావతి, నాక్ ఇంజినీర్ విశ్వనాథ్ పాల్గొన్నారు.
పార్కును అభివృద్ధి చేయాలని వినతి
తమ కాలనీలోని పార్కును అభివృద్ధి చేయాలని జీడిమెట్ల డివిజన్లోని సల్సార్ గార్డేనియా ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు కోరుతూ ఎమ్మెల్యేకు వినతిపత్రాన్ని అందజేశారు. తగు ప్రణాళికలు సిద్ధం చేసి పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కాలనీ వాసులు భాస్కరన్, దేవారెడ్డి, సింగ్, నితీశ్, రాహుల్, శ్రీధర్, రాజీవ్ పాల్గొన్నారు.