సుల్తాన్బజార్, ఆగస్టు 5 : కోఠిలోని ఉస్మానియా మెడికల్ కళాశాలలో నేషనల్ అకాడమిక్ ఆఫ్ బర్న్స్ ఇండియా(నాబి), ఉస్మానియా మెడికల్ కళాశాల ప్లాస్టిక్ సర్జరీ విభాగం సంయుక్తాధ్వర్యంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న నాబి మిడ్ టర్మ్ సీపీడీ-2023 జాతీయ సదస్సు శనివారం ముగిసింది. ఈ సందర్భంగా సదస్సు ప్రధాన కార్యదర్శి, ఓఎంసీ ప్లాస్టిక్ సర్జరీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ పలుకూరి లక్ష్మి మాట్లాడుతూ ఓఎంసీలో ప్లాస్టిక్ సర్జరీ విభాగం గోల్డెన్ జూబ్లీ వేడుకలలో భాగంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ జాతీయ సదస్సును యువ వైద్య విద్యార్థులకు ఎంతో ఉపయోగపడిందని అన్నారు. సదస్సులో పుట్టుక నుంచి చెవి లేకపోవడం, కాలిన గాయాలతో చెవి కోల్పోయినా తిరిగి చెవులను ఎలా పునరుద్ధరించాలో డాక్టర్ నితిన్ మొఖల్ పీజీ వైద్య విద్యార్థులకు, ఫ్యాకల్టీకి శిక్షణ ఇచ్చారు. సుమారు 250మంది నర్సింగ్ సిబ్బందికి ముంబయి నుంచి వచ్చిన ఇంటర్ బర్న్స్ ఇండియా డైరెక్టర్ డాక్టర్ శోభా చమియాన్, డాక్టర్ లిఖిత, డాక్టర్ ఫారూఖీ, డాక్టర్ రోహిత్, డాక్టర్ ఏంజిలినాలు కాలిన గాయాలతో ఉన్నవారికి ఎలా వైద్య చికిత్సలు ఇవ్వాలో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో శిక్షణతో పాటు అవగాహన కల్పించారు. ఈ సదస్సులో వివిధ రాష్ర్టాల నుంచి 36 మంది సీనియర్ ప్రొఫెసర్లు, 500 డెలిగేట్స్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాబి డైరెక్టర్ అనంత్ సిన్హా, డాక్టర్ ఎస్పీ బజాజ్, డాక్టర్ మేధా భానుమూర్తి, డాక్టర్ కృష్ణారావు, డాక్టర్ రత్నభూషణ్, డాక్టర్ అనురాగ్ చిత్రాంషి, ప్రొఫెసర్ శోభా చమియాన్, ఏమ్స్ వైద్యులు డాక్టర్ లిఖితారెడ్డి, డాక్టర్ రోహిత్, పీజీ వైద్యులు సానోజిత్, సందీప్, మధురిక, పరీక్షిత్, రిషిత, సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.