సిటీబ్యూరో, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): చర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో శనివారం తెల్లవారుజామున చెంగిచర్ల హరితవనం కాలనీలో నివాసముండే విజయారెడ్డి, ఆమె కొడుకు విశాల్రెడ్డి, కూతురు చేతనరెడ్డితో కలిసి రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడిన ఘటన అందరినీ కలిచివేసింది. అయితే ఐదు రోజులవుతున్నా ఆత్మహత్యకు గల కచ్చితమైన కారణం బయటపడ లేదు. సాంకేతిక ఆధారాలతో పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా కుటుంబ తగాదాలు, ఆస్తి తగాదాలు, తోటి ఉద్యోగులతో, స్థానికులతో విజయారెడ్డికి తగాదాలు లేవు.. కేవలం ఒంటరి తనంతో ఉన్న ఆమె పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడడం అనేది మిస్టరీగానే మారింది.
విజయారెడ్డి భర్త సురేందర్రెడ్డి దుబాయ్లో ఉద్యోగం చేస్తుండగా, ఆమె మాదాపూర్లోని ఓ ఐటీ కంపెనీలో టీమ్ లీడర్గా పనిచేస్తున్నారు. కూతురు చేతన ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం, కొడుకు విశాల్ ఘట్కేసర్లోని ఓ ప్రైవేట్ కళాశాలలో హాస్టలో ఉంటూ.. మొదటి సంవత్సరం చదువుతున్నారు. ప్రతి రోజు క్యాబ్లోని తన కార్యాలయానికి విజయరెడ్డి వచ్చిపోయేవారు. అయితే శుక్రవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో ఆమె తన సొంతకారులో ఇంటి నుంచి బయలుదేరారు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న ఆమె తల్లి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? క్యాబ్ ఎందుకు రాలేదంటూ ప్రశ్నించారు.
తనకు ఆఫీసులో పని ఎక్కువగా ఉందని, అందుకే తన కారులో వెళ్తున్నానంటూ తల్లికి సమాధానం చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్లారు. పిల్లలు ఉంటున్న హాస్టల్స్కు వెళ్లి తమ బంధువు చనిపోయారంటూ వాళ్లను ఆ రోజు రాత్రే తన వెంట తీసుకొచ్చారు. రాత్రి 11.30 గంటల ప్రాంతంలో చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్దకు వెళ్లి అక్కడ పార్కింగ్లో కారును పార్కు చేశారు. అక్కడ కొద్దిసేపు ఉండి 12 గంటల తరువాత రైల్వే స్టేషన్ లోపలికి వెళ్లి ఫ్లాట్ఫాంమ్పై అరగంట పాటు ఉన్నారు.
ఆ తరువాత రైలు పట్టాలపై ముగ్గురు నడుచుకుంటూ ఘట్కేసర్ వైపు వెళ్లారు. కొద్దిసేపట్లోనే ఎదురుగా గూడ్స్ రైలు వస్తుండడంతో తమ పిల్లల ఇద్దరిని కౌగిలించుకొని ఆమె రైలు పట్టాలకు మధ్యలోనే ఉండిపోయారు. రైలు పట్టాలపై ఎవరో ఉన్నారని గుర్తించిన గూడ్స్ రైలు లోకో పైలట్ హారన్ కొడుతూ గట్టిగా అరుస్తూ వచ్చాడు.. అయినా వాళ్లు అక్కడి నుంచి పక్కకు జరగకుండా ముగ్గురు హత్తుకొని అక్కడే ఉండిపోయారు. ఇంతలోనే రైలు వారిని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు.
రైలుస్టేషన్లో తెలియడంతో..!
చర్లపల్లి రైల్వే స్టేషన్కి అదే రాత్రి సమాచారం వచ్చింది… ఎవరో రైలు కింద పడ్డారని, ఈ సమాచారం అందుకున్న అక్కడ పనిచేసే రైల్వే ఉద్యోగి ఒకరు రైలు పట్టాల వెంట నడుచుకుంటూ వెళ్లడంతో సుమారు కిలోమీటర్ దూరంలో ముగ్గురి మృతదేహాలు చిందర వందరగా పడి ఉన్నాయి… అప్పటికే అక్కడ కుక్కలు వచ్చాయి… దీంతో ఆ ఉద్యోగి అక్కడే ఉంటూ కొద్దిసేపు కాపాల కాశాడు.. ఈ విషాదకర విషయాన్ని ఓ రైల్వే ఉద్యోగి సోషల్ మీడియాలోను పోస్టు చేశాడు. సికింద్రాబాద్ రైల్వే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.
మృతి చెందిన విశాల్ జేబులో కారు కీ పోలీసులకు లభించింది. దాని ఆధారంగా పార్కింగ్లో ఉన్న కారును గుర్తించారు. ‘నేను జీవించలేను.. ఈ జీవితం చాలా భారంగా ఉంది. బతకాలని ప్రయత్నించినా.. బతకలేకపోతున్నా… జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుంటున్నాం. పిల్లలను వదలి వెళ్లలేక నాతోపాటు తీసికెళ్తున్నా.. మా చావుకు ఎవరూ కారణం కాదు.. అమ్మా నన్ను క్షమించు’ అనే పార్కింగ్ స్లిప్పై రాసిన సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
విజయరెడ్డి భర్త సురేందర్రెడ్డి స్వస్థలంలో ఏపీలోని నెల్లూరు. నాలుగు నెలల కిందటే దుబాయ్ నుంచి నగరానికి వచ్చి భార్య, పిల్లలతో కొన్ని రోజులు గడిపి తిరిగి వెళ్లిపోయినట్లు పోలీసులకు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇదిలాఉండగా కొద్దిరోజుల కిందటే విజయరెడ్డి పెంపుడు కుక్క చనిపోయిందని స్థానికులు వెల్లడించారు. విషయం తెలుసుకున్న ఆమె భర్త దుబాయ్ నుంచి వచ్చారు. తమ కుటుంబంలో ఎలాంటి సమస్యలు, గొడవలు లేవని, తన కుమార్తెకు ఏ బాధ లేదు అంటూ విజయరెడ్డి తల్లి పుష్పలత సైతం తెలిపారు.
కఠిన నిర్ణయం ఎందుకు..
ఒంటరి తనంతో కుంగిపోయి విజయారెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డారనే వాదన మాత్రమే దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. ఇంటర్ చదువుతున్న పిల్లలను ఆత్మహత్యకు తల్లి ఎలా ఒప్పించింది.. తల్లి ఆత్మహత్య చేసుకోవాలన్నా పిల్లలు ఎలా ఒప్పుకొన్నారు.. పిల్లలే స్వయంగా తల్లిని వారించే స్థాయిలో ఉండగా, అలాంటి నిర్ణయం ఆమె ఎలా తీసుకున్నారనేది ఇప్పుడు సర్వాత్ర చర్చనీయాంశంగా మారింది. ఆర్థిక సమస్యలు, కుటుంబ తగాదాలు లేని కుటుంబం.. టీమ్ లీడర్గా పనిచేస్తున్న ఓ మహిళ ఇంటర్ చదువుతున్న పిల్లలతో కలిసి ఆత్మహత్యకు ఒడిగట్టడం అనేది ఎన్నో సందేహాలను లెవనెత్తుతుంది. రైల్వే ఇన్స్పెక్టర్ సాయి ఈశ్వర్గౌడ్ నేతృత్వంలో ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నది.
అయితే ఆమె వాట్సాప్లో ‘సారీ మేడం మరోసారి ఇలా చేయను’ అంటూ ఒక మెసేజ్ను గుర్తించారు. ఆ సందేశానికి ఆత్మహత్యలకు ఏమైనా సంబంధముందా అనే కోణంలోనూ ఆరా తీశారు. ఆ మెసేజ్ గత ఏడాదికి సంబంధించిందని పోలీసులు నిర్ధారించారు. ఎవరికీ చెప్పుకోలేని బాధలో ఆమె ఏమైనా ఉందా? టీమ్ లీడర్గా ఉన్నా ఆమె అలాంటి సమస్యలు వస్తే పరిష్కరించుకోగలిగే సత్తా ఉంటుంది. అంత పెద్ద కఠిన నిర్ణయం ఎలా తీసుకుంటున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది.