తెలుగు యూనివర్సిటీ, ఆగస్టు 29: తెలుగు భాషకు విశేష కృషిచేసిన గిడుగు రామ్మూర్తి పంతులును తెలుగు ప్రజలు ఎప్పటికీ మరువవద్దని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి అన్నారు. జీవీఆర్ ఆరాధన కల్చరల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ గాయనీ భూదేవి గానం చేసిన ‘మా తెలుగుతల్లికి మల్లెపూదండ’ వీడియో గీతం ఆవిష్కరణ కార్యక్రమం రమణాచారి క్యాంపు కార్యాలయంలో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా రమణాచారి మాట్లాడుతూ, తెలుగు భాష పట్ల పిల్లలకు ప్రేమను పెంచుతూ ప్రతి ఒక్కరూ మాట్లాడేలా పెద్దలు కృషి చేయాలని సూచించారు. దేశంలోని ఇతర రాష్ట్రాలలో మాతృభాష పట్ల మమకారం మెండుగా కనబడుతుందని తెలుగు ప్రజలు మాత్రం విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భూదేవి వీడియో గీతం తెలుగు ప్రజలలో స్ఫూర్తిని నింపుతుందన్నారు. ఏపీ నాటక అకాడమీ పూర్వ అధ్యక్షులు గుమ్మడి గోపాలకృష్ణ, ప్రఖ్యాత గాయని స్నేహలతా మురళి, సంగమం సంస్థ వ్యవస్థాపకులు, సినీ పరిశోధకులు సంజయ్ కిషోర్, జీవీఆర్ ఆరాధన సంస్థ చైర్మన్ గుదిబండ వెంకటరెడ్డి తదితరులు పాల్గొని భాషా పరిరక్షణకు పలు సూచనలు చేశారు.