హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): భారీ వర్షాల నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్లు, అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ ఆదేశించారు. వరుసగా రెండు రోజులు సెలవులు వస్తున్నందున మున్సిపల్ సిబ్బంది పనిచేసే కేంద్రాన్ని విడిచి వెళ్లకూడదని, సెలవుల సమయంలోనూ పనిచేసే ప్రాంతాల్లోనే ఉండాలని స్పష్టం చేశారు. ఇప్పటికే చెరువులు, కుంటలు, వాగులు నిండి ఉన్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో వరదలు ఇంకా పెరిగే అవకాశం ఉన్నందున అధికారులు నిరంతరం అప్రమత్తంగా సూచించారు.
ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చూసుకోవాలని, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా నిరోధించేందుకు ఇతర శాఖల అధికారులతో కలిసి పనిచేయాలని స్పష్టం చేశారు. శనివారం ఆయన సీడీఎంఏ ఎన్ సత్యనారాయణతో కలిసి మాసబ్ట్యాంక్లోని కార్యాలయం నుంచి మున్సిపల్ కమిషనర్లు, ఇంజినీరింగ్ అధికారులు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, మెప్మా పీడీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా కమిషనర్లకు పలు సూచనలు చేశారు. మరో రెండు మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించినందున తగు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని చెరువులు, కుంటలకు గండ్లు పడకుండా చూసుకోవాలని, నీటిపారుదల శాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలని స్పష్టం చేశారు.
భారీ వర్షాలతో ముంపునకు గురైన లోతట్టు ప్రాంతాలు, కాలనీల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి అన్ని సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. శిథిలావస్థలో ఉన్న ఇండ్లలోని కుటుంబాలను ఖాళీ చేయించాలని, ప్రమాదకరంగా ఉన్న వాటిని కూల్చివేయాలని సూచించారు. చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలని, మురుగు కాలువలకు ఆటంకాలు లేకుండా చూడాలని, తాగునీరు కలుషితం కాకుండా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో డీటీసీపీ విద్యాధర్, ప్రజారోగ్య విభాగం ఈఎన్సీ శ్రీధర్, ఇరిగేషన్ ఈఎన్సీ ధర్మానాయక్, సీడీఎంఏ అధికారులు పాల్గొన్నారు.