సిటీబ్యూరో, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ) : వర్షాలు తగ్గుముఖం పట్టడంతో జంట జలాశయాల్లోకి వరద నీటి ప్రవాహం క్రమక్రమంగా తగ్గుతోంది. బుధవారం హిమాయత్సాగర్ నుంచి రెండు గేట్లను రెండు అడుగల మేర ఎత్తి 1400 క్యూసెక్కులు, ఉస్మాన్సాగర్ నుంచి ఆరు గేట్లను మూడు అడుగుల మేర ఎత్తి 2100 క్యూసెక్కుల నీటిని వదిలారు. అయితే, గురువారం ఉస్మాన్సాగర్ రిజర్వాయర్ల గేట్లలో నాలుగు మూసేసి కేవలం రెండు గేట్ల ద్వారా 700 క్యూసెక్కులు, హిమాయత్సాగర్ నుంచి రెండు గేట్ల ద్వారా 700 క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదులుతున్నారు. హిమాయత్సాగర్లోకి 800 క్యూసెక్కులు, ఉస్మాన్సాగర్లోకి 800 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందని, వరద అంచనాకు అనుగుణంగా గేట్ల ఎత్తివేత, మూసివేతపై నిర్ణయం ఉంటుందని అధికారులు తెలిపారు.