అడుగు దూరంలో మృత్యువు కాచుక్కూచొని ఉన్నది. కంటికి కనిపించని చిన్న పురుగు.. చాన్స్ ఇస్తే చాలు.. క్షణమాత్రంలో శరీరంలోకి చొచ్చుకుపోయి.. ప్రతి అంగాన్ని ఉక్కిరిబిక్కిరిచేసి ఉసురు తీయడానికి సిద్ధంగా ఉన్నది. ఎదురుగా రోగి ఊపిరాడక అల్లాడిపోతున్నాడు. దగ్గరకు వెళ్తే పురుగు కాటేస్తుంది. వెళ్లకుంటే.. రోగిని అంతంచేస్తుంది. కష్టమైన పరిస్థితి. ఎలాగైనా రోగిని కాపాడాలి. అందుకు మహమ్మారిని ఎదుర్కోవాలి.
మన వైద్యుల ముందున్న లక్ష్యం ఒక్కటే. ప్రాణాలను కాపాడటం. ఇందుకోసం ఎంతటి హాలాహలాన్నైనా గొంతులో బిగించిపట్టుకొని.. మాయాయుద్ధం చేస్తున్న కొవిడ్ను అంతంచేయడమే పరమ విధి. ప్రాణం పోయినా సరే.. మరో ప్రాణం నిలబెట్టాల్సిందే.
వారు.. మన వైద్యులు.. కనిపించే దేవుళ్లు.
నిత్యం కరోనా రోగులతోనే ఉంటున్న డాక్టర్ల మనోధైర్యం ఏపాటిది? ఒక ప్రాణాన్ని నిలిపేందుకు ఎంత తపించినా అది ఫలించకపోతే వాళ్ల హృదయాలు ఎంతలా తల్లడిల్లుతాయో అంచనా వేయగలమా?
వాళ్ల మనసు ఎంత కకావికలమవుతుందో చెప్పగలమా? ఎంతో ఒత్తిడి.. మరెంతో సంఘర్షణ.. అయినా రాత్రి, పగలు తేడా లేకుండా రోగుల సేవలో నిమగ్నమవుతున్నారు. తోటి సహచరులే వైరస్కు బలవుతుంటే గుండెను బండరాయి చేసుకొని ఆత్మైస్థెర్యం కోల్పోకుండా కరోనా మహమ్మారిపై పోరాడుతున్నారు.
కుటుంబాలను వీడి, పిల్లలకు, తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ లోలోపల నరకం అనుభవిస్తున్నా, పైకి మాత్రం చిరునవ్వుతో వైద్యసేవలు అందిస్తున్నారు. మనల్ని కాపాడుతున్న వైద్యులను ఇప్పుడు మనం కాపాడుకోవాలి. వాళ్లు నిరాశ, నిస్పృహల్లోకి జారిపోకుండా దన్నుగా నిలవాలి.
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 10 (నమస్తే తెలంగాణ): ఒకటి కాదు, రెండు కాదు.. ఏడాదిగా అలుపనేదే లేకుండా వైద్యులు కరోనా సేవలు అందిస్తున్నారు. వైరస్ సోకిన రోగుల మధ్యే ఉంటూ, వాళ్లను కాపాడుతూ, తమను తాము కాపాడుకుంటున్నారు. వైరస్ సోకే ప్రమాదం ఉందని, దాని ప్రభావం దారుణంగా ఉంటుందని తెలిసినా నిస్వార్థ సేవలు అందిస్తున్నారు. మానసికంగా, శారీరకంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంటికి వెళ్తే ఇంట్లో వాళ్లకు వైరస్ అంటించినవాళ్లమవుతామని కుటుంబానికి, వాళ్ల ఆత్మీయస్పర్శకు దూరంగా ఉంటున్నారు. విపరీతమైన పనిభారంతో మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. కొందరు డిప్రెషన్లోకి జారుకొంటున్న సందర్భాలు ఉన్నాయి. ఇకపోతే, విధినిర్వహణలో పీపీఈ కిట్ కచ్చితంగా ధరించాల్సిందే. మాస్కులు పెట్టుకోవాల్సిందే, గ్లౌజ్లు తొడుక్కోవాల్సిందే. ఉక్కపోతకు అల్లాడిపోతున్నా గంటల పాటు వాటిని ధరించి డ్యూటీ చేస్తున్నారు. శరీరంపై ఎర్రటి దద్దుర్లు, ఫంగస్ వస్తున్నా, మాస్కు వల్ల తగినంత ఆక్సిజన్ అందకున్నా అంకితభావంతో విధులు కొనసాగిస్తున్నారు.
నిబంధనలు పాటించరా?
కరోనాను తరిమికొట్టే బాధ్యత డాక్టర్లదే కాదు.. మనందరిది. కానీ కొందరు కొవిడ్ నిబంధనలు పాటించకుండా ఇష్టారీతిన ప్రవర్తిస్తున్నారు. వ్యాక్సిన్ కేంద్రాలలో గందరగోళం సృష్టిస్తున్నారు. ముందు టీకా వేయాలని గొడవచేస్తున్నారు. ఏ మాత్రం సంయమనం పాటించకుండా డాక్టర్లను, వైద్య సిబ్బందిని దూషిస్తున్నారు. ఇలాంటి చర్యలు డాక్టర్లను మరింత ఒత్తిడిలోకి నెట్టేస్తున్నాయి. ఒకవైపు పనిభారం, మరోవైపు ఛీత్కారాలు, బెదిరింపులు ఎదురవుతున్నా వాటన్నింటినీ తట్టుకొని పోరాట పటిమతో ముందుకుసాగుతున్నారు. ఇలాంటి చర్యలకు మనవంతుగా అడ్డుకట్ట వేయాల్సిందే. డాక్టర్లకు తోడుగా ఉండటం అంటే.. మన ఆరోగ్యానికి మనం భరోసా ఇచ్చుకొన్నట్టే.
వైద్య సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ప్రజలారా బాధ్యత మనదే..
ఒత్తిడిని దూరం చేసుకోవాలి
ధ్యానం చేయండి.. పాటలు వినండి
వైద్యసిబ్బంది ఎవరూ ఆందోళనకు గురికావాల్సిన పనిలేదు. యోగా, ధ్యానం చేయండి. ఇష్టమైన వ్యక్తులతో, సన్నిహితులతో తరచూ సంభాషించండి. అయినా మనసులో ఆందోళన ఉంటే కౌన్సెలింగ్ తీసుకోండి.
ప్రశాంతతతో విధులు నిర్వర్తించండి
వైద్యసిబ్బందికి క్షేత్రస్థాయిలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పనిభారం పెరిగింది. అయినా ప్రజాసేవ చేయాలన్న లక్ష్యంతో ముందుకువెళ్తున్నాం. కిందిస్థాయి సిబ్బందికి ఎప్పటికప్పుడు కౌన్సెలింగ్ ఇస్తున్నాం. ఉద్రేకాలకు లోనుకాకుండా, ప్రశాంతంగా విధులు నిర్వర్తించేలా వారిని మోటివేట్ చేస్తున్నాం.