కంటోన్మెంట్, ఆగస్టు 9: అనుమానాస్పద మృతి కేసును బోయిన్పల్లి పోలీసులు ఛేదించారు. అప్పు చెల్లించలేదని ఆ వ్యక్తిని హత్య చేసినట్లు తేల్చారు. ఇన్స్పెక్టర్ రవికుమార్, ఎస్సై సుధాకర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. దుబ్బాకకు చెందిన గంగారాం న్యూ బోయిన్పల్లి సంజీవయ్యకాలనీలో నివాసముంటూ.. స్థానికంగా బోన్ సెట్టింగ్ దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. భార్య మృతిచెందడం, కుమారుడు స్వగ్రామంలో ఉండటంతో గంగారాం ఒంటరిగానే ఉంటున్నాడు. కొద్ది నెలల కిందట చిన్నతోకట్టకు చెందిన పాల వ్యాపారి గడ్డం సాయిరాం (31) వద్ద తన ద్విచక్రవాహనాన్ని కుదవపెట్టి రూ.10వేలు అప్పు తీసుకున్నాడు. అందులో రూ. 3వేలు తిరిగి ఇచ్చాడు. మిగతా డబ్బులు మరికొద్దిరోజుల్లో చెల్లిస్తానని చెప్పి.. తన బైక్ను తీసుకెళ్లాడు. ఈనెల 1న సాయిరాం అనేకసార్లు డబ్బుల కోసం గంగారం ఇంటికి వెళ్లినప్పటికీ అతను తలుపులు తీయలేదు.
దీంతో ఆగ్రహించిన సాయిరాం, సంజీవయ్య కాలనీకి చెందిన పెయింటర్ కమల్కుమార్(54)ను వెంటబెట్టుకొని గంగారాం ఇంటికి వెళ్లగా, అక్కడ మాటామాటా పెరిగి గొడవ జరిగింది. దీంతో సాయిరాం, కమల్కుమార్ గంగారం గొంతు నులిమి హత్య చేశారు. ద్విచక్రవాహనం, ల్యాప్టాప్తో పాటు మృతుడి వద్ద ఉన్న కొంత డబ్బును తీసుకొని జారుకున్నారు. ఈనెల 2 న గంగారాం తన ఇంట్లో మృతిచెంది పడి ఉన్నట్లు గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి గొంతుపై మరకలు ఉండటంతో పోలీసులకు అనుమానం వచ్చింది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించి.. దర్యాప్తును వేగవంతం చేశారు. మృతుడి ఇంటి పరిసరాల్లోని సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు. వారు నేరాన్ని అంగీకరించడంతో అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.