బంజారాహిల్స్, జూలై 16: జూబ్లీహిల్స్లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఘటన వివరాలిలా ఉన్నాయి. ఉత్తర్ప్రదేశ్లోని కౌషంబీ జిల్లాకు చెందిన విజిలేశ్ కుమార్(30) రెండునెలల కిందట నగరానికి వచ్చి, కాచిగూడలోని లియో సెక్యూరిటీ ఏజెన్సీలో సెక్యురిటీ గార్డుగా ఉద్యోగంలో చేరాడు. అతడికి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్- 7 లోని 4 వీల్స్ ట్రావెల్స్కు చెందిన పార్కింగ్ స్థలంలో డ్యూటీ వేశారు. సమీపంలోని మరో ఖాళీ స్థలంలో ఉన్న గదిలో ఉంటున్న విజిలేశ్ ఈనెల 13 నుంచి డ్యూటీకి వెళ్లడం లేదు. దీంతో స్నేహితులు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇదిలా ఉండగా, శుక్రవారం విజిలేశ్ ఉంటున్న గదికి సమీపంలో ఉన్న అపార్ట్మెంట్ ప్రహరీ సమీపంలో దుర్వాసన వస్తుందని స్థానికులు జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ రాజశేఖర్రెడ్డితో పాటు సిబ్బంది అక్కడకు చేరుకుని పరిశీలించగా.. ప్రహరీని ఆనుకుని ఉన్న ఖాళీ స్థలంలో పెట్టిన భారీ హోర్డింగ్ వెనుక మృతదేహం కనిపించింది. సగం కుళ్లిపోయిన ఈ మృతదేహం విజిలేశ్దిగా అక్కడున్న వారు గుర్తించారు. హత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.