ఎల్బీనగర్, మే 19 : హోటల్లో చికెన్ లేదని చెప్పినందుకు నలుగురు యువకులు సర్వెంట్పై దాడి చేయగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. కొత్తపేటలో చోటుచేసుకున్న ఈ హత్యకేసులో నలుగురు నిందితులను బుధవారం సరూర్నగర్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం, బీదర్ జిల్లా, మొర్కందివాడి గ్రామానికి చెందిన పాలంపల్లి మహేశ్(20), అతడి సోదరుడు పాలంపల్లి విజయ్(24), ఇద్దరూ కలిసి కొంతకాలంగా కొత్తపేట పండ్ల మార్కెట్లో హమాలీ పనులు చేస్తున్నారు.
అదే రాష్ర్టానికి చెందిన మరో ఇద్దరు బాల నేరస్తులు కొత్తపేట పండ్ల మార్కెట్లోని శ్రీకృష్ణ పండ్ల కంపెనీ వద్ద వారికి పరిచయం అయ్యారు. ఈ నెల 2న రాత్రి 7.30 గంటలకు నలుగురు కలిసి కొత్తపేటలోని శ్రీదుర్గా భవానీ హోటల్కు వెళ్లి.. భోజనంతోపాటు చికెన్ ఆర్డర్ ఇవ్వగా హోటల్లో సర్వెంట్గా పనిచేస్తున్న కర్ణాటక రాష్ట్రం లచ్చిరామ్ తండాకు చెందిన బాలాజీ రాథోడ్ తమ వద్ద చికెన్ లేదని, బోటి ఉన్నదని చెప్పాడు. దీంతో మహేశ్ కిచెన్లోకి వెళ్లి చూడగా చికెన్ కనిపించింది.
ఈ విషయంలో సర్వెంట్ బాలాజీకి, నలుగురు యువకులకు మధ్య గొడవ జరుగుతుండగా హోటల్ యజమాని కల్సె సుధాకర్ జోక్యం చేసుకుని సర్దిచెప్పి పంపించాడు. అదేరోజు రాత్రి 8గంటలకు పథకం ప్రకారం.. నలుగురు కలిసి హోటల్ వద్దకు వచ్చి బాలాజీపై దాడికి పాల్పడ్డారు. అంతలోనే మహేశ్ రాయితో బాలాజీ తలపై మోదగా తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే నిందితులు అక్కడినుంచి పరారయ్యారు. స్థానికులు గాయపడిన బాలాజీని గుర్తించి చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ ఈ నెల 16న బీదర్లోని ఓ దవాఖానలో మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీటీవీ ఫుటేజీల సహాయంతో నిందితులను గుర్తించి అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.