బంజారాహిల్స్, నవంబర్ 24 : కాలనీలు, బస్తీల వాసులు ఆనందంగా పంక్షన్లు చేసుకోవాలనే సకల వసతులతో కూడిన మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్స్ను నిర్మిస్తున్నామని రాష్ట్రమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బంజారాహిల్స్ రోడ్ నం 13లోని శ్రీరాంనగర్లో రూ.2.05కోట్ల వ్యయంతో నిర్మించతలపెట్టిన మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణపనులను మంత్రి తలసాని శ్రీనివాస్, నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ బస్తీలు, కాలనీల్లో నివాసముండే పేదలు, మధ్య తరగతి ప్రజలు ప్రైవేటు ఫంక్షన్ హాల్స్లో లక్షలు ఖర్చుపెట్టిన వివాహాలు, ఇతర శుభకార్యాలు చేసుకోవాలంటే ఎంతో ఇబ్బందులు పడుతున్నారని.. దీన్ని దృష్టిలో ఉంచుకొని నగరవ్యాప్తంగా అనేక బస్తీల్లో మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్స్ నిర్మిస్తున్నామని చెప్పారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని బీఎస్ మక్తా, దీన్ దయాళ్నగర్, గౌరీశంకర్ కాలనీ, ఖైరతాబాద్లోని ఐమాక్స్ సమీపంలోని ప్రభుత్వ స్థలాల్లో సైతం మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్స్ నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
పేదల అభివృద్ధి కోసం ఎన్ని నిధులైనా ఖర్చు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని పేర్కొన్నారు. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మాట్లాడుతూ సుమారు పదివేల జనాభా ఉన్న శ్రీరాంనగర్లో కమ్యూనిటీహాల్ లేకపోవడంతో పేదలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారని, వారి ఇబ్బందులను గుర్తించి స్థలాన్ని కేటాయించడంతో పాటు మల్టీపర్పస్ పంక్షన్హాల్ నిర్మాణం కోసం రూ.2.05కోట్లు నిధులు కేటాయించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఈఈ విజయ్కుమార్, తదితరులు పాల్గొన్నారు.