దుండిగల్, నవంబర్ 20: మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు చేరికతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ తిరుగులేని శక్తిగా మారిందని ప్రభుత్వ విప్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల పరిశీలకులు శంభీపూర్రాజు, ఎమ్మెల్యే వివేకానంద్ అన్నారు. ఇటీవల టీ టీడీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు.. సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన విషయం తెలిసిందే.
సోమవారం దుండిగల్ మున్సిపాలిటీ పరిధి బహదూర్పల్లిలోని మేకల వెంకటేశం గార్డెన్స్లో ఆయనకు పౌరసన్మానం నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్సీ శంభీపూర్రాజు, ఎమ్మెల్యే వివేకానంద్ ముఖ్యఅతిథులుగా పాల్గొని, గజమాలతో కాసానిని సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. టీ టీడీపీ అధ్యక్ష పదవికి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరడం పార్టీకి మరింతబలం చేకూర్చిందన్నారు. ఆయన రాజకీయ అనుభవంతో రానున్న రోజుల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి, సంక్షేమంలో అగ్రపథంలో నిలుపుతామన్నారు.
ఈ సందర్భంగా సీనియర్ బీఆర్ఎస్ నాయకులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధికి, అన్ని వర్గాల సంక్షేమానికి నిత్యం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీకే ముదిరాజులతో పాటు అన్నివర్గాల ప్రజల మద్దతు ఉంటుందని తెలిపారు. తొమ్మిదిన్నరేండ్లలో తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా మారిందన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో రాష్ట్రంలోని బడుగు, బలహీన వర్గాల ప్రజలు ఆర్థికంగా బలోపేతం చెందారన్నారు. ఫలితంగా ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుపొంది.. హ్యాట్రిక్ కొట్టడం ఖాయమన్నారు.
కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ నిత్యం నియోజకవర్గం అభివృద్ధికి పరితపిస్తున్నాడని, మరోసారి గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. అంతకు ముందు బీఆర్ఎస్ శ్రేణులు చింతల్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి మేకల వెంకటేశం గార్డెన్ వరకు భారీ బైక్ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ మండలం మాజీ ఎంపీపీ చినంగి వెంకటేశం, యువనేత కాసాని వీరేశ్ ముదిరాజుతో పాటు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ముదిరాజు కులబాంధవులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.