బన్సీలాల్పేట్, అక్టోబర్ 17 : ముదిరాజ్ మహాసభ శతవసంత ఉత్సవాలు న్యూబోయిగూడలోని ముదిరాజ్ భవన్లో ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి సాద్వి నిరంజన్ జ్యోతి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వళన చేసి ప్రారంభించారు. 1922లో ముదిరాజ్ మహాసభను స్థాపించిన హైదరాబాద్ నగర తొలి మేయర్, సంఘ సంస్కర్త కృష్ణస్వామి ముదిరాజ్, నవాడ ముత్తయ్యల చిత్రపటానికి నివాళులర్పించారు. ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ సామాజికంగా, ఆర్థికంగా, చేపలు పట్టే వృత్తిలో ఉన్న ముదిరాజ్లను బీసీ డీ నుంచి ఏ గ్రూపులోకి మార్చాలనే న్యాయమైన డిమాండ్ సాధన కోసం పోరాడుతామన్నారు. డిసెంబర్ 20న నగరంలో భారీ బహిరంగసభ నిర్వహించబోతున్నట్లు చెప్పారు. అంతకుముందు దసరా ముదిరాజ్ సమ్మేళనం,సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహించారు. అఖిల భారత ముదిరాజ్, కోలీ సమాజ్ జాతీయ అధ్యక్షుడు కువార్జీ భవారియా, ముదిరాజ్ మహాసభ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జగదీశ్వర్ ప్రసాద్, ఉపాధ్యక్షుడు సదానంద్, చెన్నయ్య, శ్రీనివాస్, వీరేశ్, మహిళా అధ్యక్షురాలు ఎం.శారద, కార్పొరేటర్ సామల హేమ తదితరులు పాల్గొన్నారు.