ఎర్రగడ్డ, అక్టోబర్ 9: విభిన్న మతాలకు చెందిన వాళ్లు సోదర భావంతో మెలగటం హైదరాబాద్ నగర ప్రత్యేకత అని రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులైన సంతోష్ కుమార్ మాజీ డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ అయిన బాబా ఫసియుద్దీన్ ఆహ్వానం మేరకు శనివారం బోరబండకు విచ్చేశారు. సైట్-3, సైట్-4, సైట్-5 ప్రాంతాల్లో ఉన్న ఆలయం, మసీదు, చర్చి ప్రాంగణాల్లో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ హైదరాబాద్లో అలుముకున్న సోదర సంస్కృతిని చూసి ప్రతి ఒక్కరు గర్వించాలన్నారు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని చూస్తుంటే సర్వమత సమ్మేళనాన్ని తలపిస్తున్నదన్నారు. ఆలయంలో జమ్మి, మసీదులో రేగు, చర్చిలో క్రిస్మస్ మొక్కను నాటారని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, బాబా ఫసియుద్దీన్లు తెలిపారు. అనంతరం వారు సంతోష్ కుమార్కు సన్మానం చేయగా.. మైనార్టీ పెద్దలు ఆప్యాయతతో కానుకలు అందజేశారు. కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇన్చార్జి కరుణాకర్రెడ్డి, బీసీ కమిషన్ సభ్యుడు కిషోర్ గౌడ్, డివిజన్ అధ్యక్షుడు కృష్ణమోహన్తో పాటు ప్రధాన, అనుబంధ కమిటీలకు చెందిన టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.