రవీంద్రభారతి, ఫిబ్రవరి14: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలో ఇచ్చిన మాట ప్రకారం, 61 ఏళ్ళు నిండిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేశ్ ఆధ్వర్యంలో వీఆర్ఏల జేఏసీ శుక్రవారం నిర్వహించిన సమావేశానికి ఆర్.కృష్ణయ్య ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎంపీ ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ, జీవో నం. 81 ప్రకారం, 61 ఏండ్లు పైబడిన వీఆర్ఏల ఉద్యోగాలను వారసులకు ఇవ్వాలన్నారు.
20,555 మంది వీఆర్ఏల వారసులలో ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలో చెప్పారని ఆయన గుర్తు చేశారు. వీఆర్ఏల వారసులకు 16,758 మందికి ఉద్యోగాలు ఇచ్చారని, మిగిలిన3,758 మందికి ఉద్యోగాలు రాక వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆయన విమర్శించారు. అధికారంలోకి వచ్చాక వీరికి ఉద్యోగాలు కేటాయిస్తామని హామీ ఇచ్చిన సీఎం రేవంత్రెడ్డి మాట నిలబెట్టుకోవాలన్నారు. వీరికి ఉద్యోగాలు ఇస్తే , రెవెన్యూ శాఖ బలోపేతంతో పాటు నిరుద్యోగులకు ఉపాధి దక్కుతుందన్నారు. వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు కేటాయించడంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల17న చలో హైదరాబాద్కు వీఆర్ఏలు ఇచ్చిన పిలుపుకు మద్దతు తెలుపుతున్నట్లు ఆర్.కృష్ణయ్య స్పష్టం చేశారు.
నిరుద్యోగుల ఓటుబ్యాంకుతో గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్రెడ్డి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడటం సరికాదని ఆయన విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పిన సీఎం ఆ హామీలు ఇపుడు ఎక్కడికి పోయాయన్నారు. ప్రభుత్వం వెంటనే నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలను నోటిఫికేషన్ వేసి భర్తీ చేయాలన్నారు. లేకుంటే విద్యార్థులు సీఎం రేవంత్ రెడ్డికి తగిన గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నిరుద్యోగులను మోసం చేయడానికి పూనుకున్నారని , వీరికి తగిన గుణపాటం చెబుతారని ఆయన తెలిపారు. కార్యక్రమంలో వీఆర్ఏల వారసుల జేఏసీ చైర్మన్ అంజనేయులు, రఘుపతి, అంజి, రమేశ్, చందు, సంగీత, బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.