గౌతంనగర్, జనవరి 22 : మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన సాంకేతిక పరిజ్ఞానంతోపాటు విలువలతో కూడిన విద్యను అందించడం కోసం తెలంగాణ ప్రభుత్వం గురుకుల పాఠశాలలను స్థాపించింది. ఇందు లో భాగంగానే మైనార్టీల బాలికల కోసం రాష్ట్ర వ్యాప్తం గా 204 తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాలలను ప్రారంభించింది. బాల బాలికల కోసం విడివిడిగా ప్రారంభమైన పాఠశాలలు..నేడు అనేక మందికి దారి దీపాలవుతున్నాయి. మౌలాలిలోని సికింద్రాబాద్ బాలికల గురుకుల పాఠశాల సౌకర్యవంతమైన భవనంలో నిర్వహించబడుతున్నది. విశాలమైన తరగతి గదులు, ఉన్నత విద్యావంతులైన ఉపాధ్యాయుల నిరంతర కృషి, తపనతో విద్యార్థినులను ఉత్తములుగా తీర్చిదిద్దుతున్నారు. 2019-20, 2020-21 విద్యా సంవత్సరాలలో సాధించిన ఫలితాలకు పాఠశాలను జూనియర్ కళాశాలగా అప్గ్రేడ్ చేయబడింది. ఆశించిన ఫలితాలు రావడంతో గురుకుల పాఠశాలలో పిల్లలను చేర్పించడానికి తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు.
విద్యార్థుల దినచర్యలో….
ప్రతి రోజు ఉదయమే పీఈటీ పర్యవేక్షణలో యోగా సాధన ఉంటుంది. స్టడీ అవర్ తరువాత ఉదయం అల్పాహారం పూర్తి చేసుకొని అసెంబ్లీకి హాజరవుతారు. రోజు ఉండే అసెంబ్లీలో ప్రార్థనతో పాటు వార్తలు, జ్ఞానానికి సంబంధించినవాటితోపాటు ప్రముఖుల గురించి తెలుసుకొని స్ఫూర్తిని పొందుతారు. అనంతరం తరగతులకు హాజరవుతారు. విద్యార్థులకు సరైన సమతుల్య ఆహారం అందిస్తారు. వారి పోషణకై రోజువారి ఆహారంలో ఎగ్, వారానికి ఒక్కసారి మాంసాహారం అందిస్తారు. నాణ్యమైన ఆహారం, పరిశుభ్రమైన వంటశాల విద్యార్థులకు చక్కటి ఆరోగ్యాన్ని అందిస్తున్నాయి. సాయంత్రం వివిధ ఆటలతో శారీరక, మానసిక ఉల్లాసాన్ని పొందుతున్నారు. టీచర్లు రాత్రి సమయాల్లోనూ, సెలవు రోజుల్లో విధులు నిర్వర్తిస్తూ వారికి మార్గదర్శనం చేస్తుంటారు.
అడ్మిషన్లకు దరఖాస్తులు..
గురుకుల పాఠశాలలో విశాలమైన తరగతి గదులు, ఉపాధ్యాయుల నిరంతరం కృషితో విద్యార్థినులను ఉత్తములుగా తీర్చిదిద్దుతున్నాం.. నాణ్యమైన ఆహారం అందిస్తున్నాం.. దీంతో పాఠశాలలో విద్యార్థులను చేర్పించ డానికి తల్లిదండ్రులు ఆకస్తిని కనబరుస్తున్నారు. 2023-24 విద్యా సంవత్సరానికిగాను తెలంగాణ మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలలో ప్రవేశాల కోసం జనవరి 30లోగా దరఖాస్తులు చేసుకోవాలి. ఇతర వివరాల కోసం ఫోన్: 7995057903, 9177410240లలో సంప్రదించాలి. – కవిత, ప్రిన్సిపాల్