ఉస్మానియా యూనివర్సిటీ, జూన్ 30 : తల్లిదండ్రులందరూ వారి పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చదివించాలని నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్రెడ్డి పిలుపునిచ్చారు. తార్నాక డివిజన్ లాలాపేటలోని గడి స్కూల్లో ‘మన ఊరు మన బడి’ కార్యక్రమాన్ని ఆమె బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారే నేడు వివిధ ఉన్నత హోదాల్లో ఉన్నారని గుర్తు చేశారు. విశాలమైన గ్రౌండ్, తరగతి గదులతో ప్రభుత్వ బడులు నడుస్తున్నప్పుడు చింత దేనికని ప్రశ్నించారు. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో సైతం ఇంగ్లీష్ మీడియంను ప్రారంభించారని చెప్పారు. విద్యార్థులకు పౌష్టికాహారం కూడా అందిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు సునీల్ ముదిరాజ్, వేణుగోపాల్రెడ్డి, వంజరి వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.