కేపీహెచ్బీ కాలనీ, అక్టోబర్ 16: వాతావరణంలో వచ్చిన మార్పులతో డెంగ్యూ లాంటి సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. ఈ నేపథ్యంలో విష జ్వరాలకు కారణమైన దోమలను ఆదిలోనే నియంత్రించడంపై దృష్టి ని సారించారు. కోర్టుల హెచ్చరికల నేపథ్యంలో మరింత బాధ్యతగా.. పక్కా ప్రణాళికతో దోమల నియంత్రణపై దృష్టి సారించారు. చెరువులు, కుంటల్లో మురుగునీటిని దోమలు ఆవాసాలుగా చేసుకొని వృద్ధి చెందుతున్న నేపథ్యంలో చెరువుల్లో గుర్రపుడెక్కను తొలగించడం.. మురుగునీరు అందులో చేరకుండా చర్యలు తీసుకోవడం, చెరువు నీటిలో రసాయనాలను పిచికారీ చేస్తున్నారు. మరోవైపు ఫాగింగ్ చర్యలు చేపట్టడం, గంబూసియా చేపలను చెరువులు, కుంటల్లో వదులుతూ ఆదిలోనే దోమలను అంతం చేసేలా ప్రత్యేక కార్యచరణను సిద్ధం చేశారు.
కూకట్పల్లి సర్కిల్ జోన్ పరిధిలో ఐదు సర్కిళ్లలో ఈ యేడాది 52 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. 2019లో 279 డెంగ్యూ కేసులు, 2020లో 30 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. ఈ యేడాది ఇప్పటికి 52 డెంగ్యూ కేసులు నమోదు కాగా వాటిలో 16 కేసులు నిర్ధారణ అయ్యాయి. డెంగ్యూ కేసులు పెరుగకుండా ఎంటమాలజీ యంత్రాంగం ప్రత్యేక చర్యలను చేపట్టింది. ఐదు సర్కిళ్లలోని 11 ప్రధాన చెరువుల్లో గుర్రపుడెక్కను తొలగించి డ్రోన్ సహాయంతో రసాయనాలను పిచికారీ చేస్తున్నారు.
దోమల పెరుగుదలపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ప్రతి ఆదివారం పరిశుభ్రతకు పది నిమిషాలు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇంటింటికీ తిరిగి ఇంట్లో నీటి నిల్వలు ఉండడం వల్ల దోమలు ఎలా పెరుగుతాయన్నదానిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కాలనీలు, బస్తీల్లో బ్యానర్లు ప్రదర్శించడంతో పాటు క్రమం తప్పకుండా ఫాగింగ్ చర్యలు తీసుకుంటున్నారు.
డెంగ్యూ జ్వరం బారిన పడిన వ్యక్తి ఇంటితో పాటు పరిసరాలపై ప్రత్యేక దృష్టిని సారిస్తారు. డెంగ్యూ కేసు నమోదైన ఇంట్లో రసాయనాలను పిచికారీ చేయడంతో పాటు చుట్టుపక్కల నివాసితుల ఇండ్లలో సైతం నీటి నిల్వలు లేకుండా అవగాహన కల్పిస్తారు. ఇంటి పరిసరాల్లో రసాయనాలను పిచికారీ చేస్తూ దోమలను అంతం చేస్తారు. ఆ కాలనీ మొత్తం ఫాగింగ్ చేపట్టి దోమలు లేకుండా చేస్తారు. డెంగ్యూ కేసు నమోదైన ఇండ్లలో సంపులు, పూలకుండీలు, పనికిరాని వస్తువులలో నీటి నిల్వలు లేకుండా చేస్తారు. దోమలు ఆనవాలు కనిపిస్తే వాటిని అక్కడే అంతం చేస్తారు.
లార్వా దశలోనే దోమలను నియంత్రించేలా పనిచేస్తున్నాం. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలకు ముందస్తు జాగ్రత్తలు వివరిస్తున్నాం. ప్రధాన చెరువుల్లో గుర్రపుడెక్కను తొలగించడం, రసాయనాలను పిచికారీ చేస్తున్నాం. ఆదివారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. డెంగ్యూ కేను నమోదైతే ఆ ప్రాంతంపై ప్రత్యేక దృష్టిని సారించి పరిసర ప్రాంతాల్లో ఎవరికీ డెంగ్యూ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. గంబూసియా చేపలు, ఆయిల్బాల్స్ నీటిలో వదలడం, కాలనీలలో ఫాగింగ్ చర్యలతో దోమలను కట్టడి చేసేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. లచ్చిరెడ్డి, సీనియర్ ఎంటమాలజిస్ట్, కూకట్పల్లి జోన్