సిటీబ్యూరో, మే 14 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్ పారిశుద్ధ్య నిర్వహణను మరింత మెరుగు పరుస్తూ వంద రోజుల ప్రణాళికను అమలు చేస్తున్నది. ప్రతి రోజు ఉదయం 9 గంటల లోపే ఇంటింటి చెత్త సేకరణ పూర్తవ్వడంతో పాటు రోడ్లపై వేసిన చెత్త కుప్పలను తొలగిస్తున్నారు. ప్రధానంగా పారిశుద్ధ్య నిర్వహణలో ‘ మై జీహెచ్ఎంసీ’ యాప్ ద్వారా కమిషనర్, జోనల్ కమిషనర్లు, డిప్యూటీ జోనల్ కమిషనర్లు, సహాయ వైద్యాధికారులు, శానిటరీ ఇంజినీర్లు పారిశుద్ధ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. యాప్ విధానం అమలులో భాగంగా చెత్తకుప్పల తొలగింపు పూర్తయిందా? లేదా అనే ‘ క్లీనింగ్ స్టేటస్’ వివరాలను సంబంధిత ఎస్ఎఫ్ఏ, స్వచ్ఛ సాతీలు ఉదయం 8.30 నుంచి 9 గంటల సమయంలో సంబంధిత మొబైల్ యాప్లో పొందుపరుస్తున్నారు. ఈ సమయంలో ఆయా ప్రాంతాల్లో చెత్త కుప్పలు కనిపించినట్లయితే ఆయా అధికారులను బాధ్యులు చేస్తూ చర్యలు ఉంటాయన్న కమిషనర్ ఆదేశాల మేరకు… పారిశుద్ధ్య నిర్వహణలో గడిచిన నెల రోజులుగా ఫిర్యాదుల సంఖ్య గణనీయంగా తగ్గిందని చెబుతున్నారు.
నిర్వహణలో మరిన్ని అంశాలు..
స్వచ్ఛ ఆటోలతో పాటు 342 టిప్పర్లు రోజు 1026 సార్లు వ్యర్థాలను సమీపంలోని తరలింపు కేంద్రానికి చేరుస్తున్నారు. ఆయా వాహనాలు సరైన సమయానికి చెత్త కుప్పలను తొలగించకపోతే సంబంధిత సహాయ వైద్యాధికారి స్వచ్ఛ ఆటోకు రూ. 200 చెల్లించి చెత్త కుప్పలను తొలగించేటట్లు చర్యలు తీసుకుంటున్నారు.
నగరంలో ఇంటింటి చెత్త సేకరణకు పని చేసే స్వచ్ఛ ఆటోలు ప్రస్తుతం 4,351 ఉన్నాయి. అవి నిత్యం విధుల్లో పాల్గొంటున్నాయా? లేదా అనే విషయాన్ని ఎస్ఎఫ్ఏలు రోజూ మొబైల్ యాప్ లో రిపోర్టు చేయాలి. నెలకోసారి సర్కిళ్లు లేదా డివిజన్ల వారీగా సంబంధిత ఉన్నతాధికారులు స్వచ్ఛ ఆటో కార్మికులతో సమావేశాలు నిర్వహించి, పారిశుద్ధ్యం పై సమీక్ష నిర్వహిస్తున్నారు.
నగర వ్యాప్తంగా ఉన్న చెత్త కుప్పల ప్రాంతాలను ఆస్కి బృందం క్షేత్రస్థాయిలో సర్వే చేసి గూగుల్ మ్యాప్లో పొందుపర్చారు. వాటిని ఐదు చొప్పున విభజించి 935 మంది పారిశుద్ధ్య సూపర్ వైజర్లకు (ఎస్ఎఫ్ఏ) పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. వారితో పాటు స్వయం సహాయక బృందాల మహిళలు..ఒక్కొక్కరు పది చెత్త కుప్పలపై నిఘా పెట్టారు. ఇందుకు జీహెచ్ఎంసీ 292 మంది స్వచ్ఛ సాతీలను నియమించుకుంది. అదనంగా 30 సర్కిళ్లకు ఒక్కో అధికారి ఓఎస్డీలుగా నియమించి, వారి ద్వారా కేంద్ర కార్యాలయానికి రోజూ సర్కిల్ స్థాయి నివేదికను సమీక్ష చేస్తున్నారు.