మాదాపూర్, అక్టోబర్ 24: చందానగర్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలో రజతోత్సవ వేడుకలు ఘనంగా ముగిశాయి. ఇందులో భాగంగా శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామిజీ పర్యవేక్షణలో ఐదు రోజులపాటు నిర్వహించిన ప్రత్యేక పూజల్లో భక్తులు భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఉదయం 5 నుంచి మొదలుకొని రాత్రి 9 గంటల వరకు స్వామివారికి హారతి, తీర్థప్రసాదాలు, చంఢీ యాగం, మహా పూర్ణాహుతి, తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర స్వామి మాట్లాడుతూ.. చందానగర్ ఆలయ విశిష్టతను వివరించారు. విశాఖ శ్రీ శారదాపీఠ పాలిత ఆలయాల్లో చందానగర్ వేంకటేశ్వరస్వామి ఆలయం ప్రధానమైనదని చెప్పారు. సీఎం కేసీఆర్కు ఇష్టదైవం రాజశ్యామల అమ్మవారని స్వామిజీ తెలిపారు.
చందానగర్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ రజతోత్సవాల్లో భాగంగా సినీ నటుడు మోహన్బాబు, ఫీనిక్స్ కన్స్ట్రక్షన్ అధినేత సురేశ్, శారదాపీఠం శాశ్వత సభ్యులు మిర్యాల రాఘవరావు, ఆలయ అధ్యక్షుడు రఘుపతిరెడ్డి, ఉపాధ్యక్షుడు అశోక్గౌడ్, ప్రవీణ్, శేషయ్య తదితరులు విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామిని కలిసి ఆశీస్సులు అందుకున్నారు.