దేశ ప్రధాని అయి ఉండి..
ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడం సిగ్గుచేటు
టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు
ఉస్మానియా యూనివర్సిటీ, మే 26 : మోదీ అంటే మోసం, దగా అని టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు అన్నారు. నమ్మకద్రోహి నరేంద్రమోదీకి తెలంగాణలో ఏం పని అని ప్రశ్నించారు. మోదీ తెలంగాణలో పర్యటించడమంటే ఇక్కడి ప్రజలను మోసం చేయడమేనని దుయ్యబట్టారు. ఉస్మానియా యూనివర్సిటీలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో తుంగ బాలు మాట్లాడారు. మోదీ అధికారం చేపట్టిన నాటి నుంచి తెలంగాణ రాష్ట్రంపై వివక్ష ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. రాష్ర్టానికి రావాల్సిన నిధులను ఇవ్వకుండా సవతితల్లి ప్రేమ చూపుతున్నారని విమర్శించారు.
ప్రధాని నోటితో నవ్వుతూ, నొసలితో వెక్కిరిస్తున్నారని మండిపడ్డారు. అధికారంపై యావ తప్ప.. తెలంగాణ ప్రజలపై ఎటువంటి ప్రేమ లేదన్నారు. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నోటికొచ్చినట్లు మాట్లాడుతూ అనేక మంది కార్యకర్తల ఆత్మహత్యలకు కారణమవుతున్నాడని ఆరోపించారు. దేశంలో మోదీ మత పిచ్చితో మత కల్లోలాలు సృష్టించి, అధికారం కాపాడుకునేందుకు ప్రయత్నిస్తుంటే, రాష్ట్రంలో బండి సంజయ్ సైతం అదే దారిలో నడుస్తున్నాడని మండిపడ్డారు. దేశంలో అనేకమంది మేధావులను జైళ్లో పెడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నది మోదీ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వంపై సిగ్గులేకుండా మాట్లాడిన మోదీ తక్షణమే తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివిన మోదీ కల చివరికి కలగానే మిగిలిపోతుందని ఎద్దేవా చేశారు. విభజన హామీలు నెరవేర్చకుండా తెలంగాణ హక్కులను కాలరాస్తున్న మోదీని ప్రజలు క్షమించబోరని అన్నారు.
మోదీ హామీలు ఎమయ్యాయని ప్రశ్నిస్తూ నగరంలో వెలిసిన ప్లెక్సీలు