రాష్ట్ర సర్కారుపై విషం చిమ్మేందుకే కేంద్ర మంత్రి అమిత్ షా..షోలు
టీపీటీపై నోరెత్తే కాషాయపు నేతలు..
సర్వీస్ చార్జీలపై మాట్లాడరేం
కంటోన్మెంట్ జనాల చెవుల్లో కాషాయం పుష్పాలు
సికింద్రాబాద్, మే 15: రాష్ట్రంపై ప్రేమలేదని మరోసారి కాషాయం పార్టీ రుజువు చేసుకుంది. శనివారం తుక్కుగూడలో నిర్వహించిన సభతో తెలంగాణ ప్రజలకు ఉన్న ఆశలన్నీ ఆవిరయ్యాయి. రాష్ర్టానికి ఏం చేస్తామో చెప్పలేని పరిస్థితిలో ఉన్న కాషాయ నేత, సర్కారుపై విషం చిమ్మడమే లక్ష్యంగా అమిత్ షా షో చేయడంపై జనం విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదిలా ఉంటే కంటోన్మెంట్ బోర్డుకు కేంద్రం నుంచి సర్వీస్ చార్జీల రూపేణా సుమారు రూ. 680 కోట్ల మేర రావాల్సిన బకాయిలను విడుదల చేయకుండా చోద్యం చూస్తుంది. అభివృద్ధి పనులు కుంటుపడుతుండటంతో పాటు కనీసం ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేని కంటోన్మెంట్కు నిధుల మంజూరుకు మోకాలడ్డుతుంది. గతంలో బోర్డు పాలకమండలి సభ్యులు ఢిల్లీ వెళ్లి మరీ రక్షణ శాఖ అధికారులకు విన్నవించినా కనికరించలేదు. ఇక్కడ సభలకు వచ్చే కేంద్ర పెద్దలు తమ పరిధిల్లో ఉండే కంటోన్మెంట్లకు నిధులు ఇవ్వరు కానీ, రాష్ర్టాలకు మొత్తం మనమే నిధులిస్తున్నామని కలరింగ్ ఇస్తుండటంపై నేతలతో పాటు ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.
బోర్డుకు రావాల్సిన నిధులు పెండింగ్లో ఉన్నాయి..
ఇక్కడి నేతలు రాష్ట్ర ప్రభుత్వం టీపీటీ చార్జీలు ఇవ్వడం లేదంటూ గగ్గోలు పెట్టే నేతలకు సర్వీస్ చార్జీలు కేంద్రం నుంచి రప్పించే బాధ్యత లేదా అంటే మాత్రం మౌనమే సమాధానంగా మిగులుతుంది. కేంద్ర సంస్థలు ఈ ప్రాంతంలో ఉండడంతో పాటు అందించే సేవలకు గాను పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. కొన్నేండ్లుగా బోర్డుకు రావాల్సిన నిధులు పెండింగ్లో ఉండడంతో .. నేటికి రూ.680 కోట్లకు పైగానే సర్వీస్ చార్జీలు బోర్డుకు రావాల్సి ఉంది. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలను కనీసం బోర్డు పరిధిలో కూడా అమలు చేయలేని పరిస్థితిలో ఉన్న కమలం నేతలు కండ్లు తెరువాలని పలువురు హితవు పలుకుతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పథకాలు దేశంలో ఎక్కడా అమలు కావడం లేదని టీఆర్ఎస్ నేతలు అమిత్ షాపై మండిపడ్డారు.
తెలంగాణ తరహా పథకాలేవి..
రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా అమలు కావ డం లేదు. కంటోన్మెంట్ బోర్డుకు రావాల్సిన నిధులను మంజూరు చేయలేనిది బీజేపీ సర్కారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్, రైతుబంధు, రైతుబీమా, ఇంటింటికీ తాగునీరు, ఆసరా పెన్షన్లు, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా అమలవుతుంటే చూపాలి. టీఆర్ఎస్ని, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ను విమర్శించే నైతిక అర్హత బీజేపీ నేతలకు లేదు. 60 ఏండ్లలో జరిగిన కాంగ్రెస్, బీజేపీ పాలనను, టీఆర్ఎస్ పాలనను బేరీజు వేసుకొని తేడాను గమనించాలి.
– జి. సాయన్న, ఎమ్మెల్యే, కంటోన్మెంట్
అమిత్ షా అబద్దాలకు కేరాఫ్..
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అబద్ధాలకు కేరాఫ్గా మారారు. తుక్కుగూడ సభ తర్వాత బీజేపీ తుక్కు తుక్కు అయింది. సభకు జనం స్పందన లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వంపై అబద్దాలు పూరించారు. మంత్రి కేటీఆర్ లేవనెత్తిన ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. విభజన హామీలను అమలు చేయడంలో బీజేపీ తెలంగాణను మోసం చేసింది. రక్షణశాఖలో భాగంగా ఉన్న కంటోన్మెంట్కు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వడం లేదు. వచ్చే బకాయిల్లో కేవలం 20 శాతం రప్పించినా కంటోన్మెంట్ను అద్దంలా చేయవచ్చు. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా టీఆర్ఎస్దే విజయం. బీజేపీకి మళ్లీ డిపాజిట్లు గల్లంతే.
– మర్రి రాజశేఖర్రెడ్డి,
మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి
కంటోన్మెంట్కే దిక్కులేదు.. రాష్ర్టానికి ఇస్తున్నారా..?
కంటోన్మెంట్ బోర్డుకు రావాల్సిన బకాయిలను విడుదల చేయ డం లేదు. రాష్ట్రంలో చేపట్టే ప్రతి పథకానికి తామే నిధులు ఇస్తున్నామని చెప్పుకోవడం సిగ్గుచేటు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే బోర్డుకు ఇచ్చే నిధులకే దిక్కులేదు కానీ, తెలంగాణకు అంతా మేమే చేస్తున్నామని అమిత్ షా షో చేయడంపై జనం భగ్గుమంటున్నారు. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను పెంచుకుంటూ పోతున్నారు. సభతో రాష్ట్రంపై బీజేపీకి ప్రేమ లేదని మరోసారి రుజువైంది. మేనిఫెస్టోలో చెప్పినవే కాదు చెప్పనివి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. సీఎం కేసీఆర్ కృషిని పార్లమెంటులో కేంద్రం పొగిడింది మర్చిపోయారా..? కుట్రలతో రాష్ట్రానికి రావాల్సిన నిధులకు ఇపుడు ఎగనామం పెడుతున్నారు.
– జక్కుల మహేశ్వర్రెడ్డి,
మాజీ ఉపాధ్యక్షుడు, కంటోన్మెంట్ బోర్డు