పీర్జాదిగూడ, డిసెంబర్18: పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ స్వచ్ఛతలో ఇతర కార్పొరేషన్లకు ఆదర్శంగా నిలువడంలో పాలకవర్గం, అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. కార్పొరేషన్లో రోజురోజుకు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పలు ప్రాంతాల్లో మోడ్రన్ టాయిలెట్లు ఏర్పాటు చేశారు. బహిరంగ మలమూత్ర విసర్జనకు స్వస్తి పలికేందుకు ప్రధాన అంతర్గత రోడ్లలో ప్రయాణికులకు, వాహనదారులకు, ఇతర ప్రాంతాల వారికి అందుబాటులో ఉండేలా కార్పొరేషన్లో పరిధిలోని పలు ప్రాంతాల్లో 13మోడ్రన్ టాయిలెట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. సుమారు రూ. 50లక్షలతో నిర్మించిన టాయిలెట్ల పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా కార్పొరేషన్లో పబ్లిక్ టాయిలెట్స్ శుభ్రపరడంపై దృష్టిసారించి వాటిని దత్తత తీసుకోవడంతో పాటు డిజైన్ టాయిలెట్స్ థీమ్లో భాగంగా పెయింటింగ్ వేయడంతో పాటు తదితర విషయాలపై ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. టాయిలెట్లను మెరుగుపరచడానికి యూజర్ ఫీడ్ బ్యాక్ను తీసుకుంటున్నారు. పబ్లిక్ టాయిలెట్స్తో పాటు పరిసరాలను శుభ్రపరచడంపై ప్రజలకు సంపూర్ణ అవగాహన కల్పిస్తున్నారు.
మరుగుదొడ్లను వినియోగించుకోవాలి
మరుగుదొడ్లు, పబ్లిక్ టాయిలెట్లను శుభ్రపరచడం పరిసరాలను పరిభ్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. బహిరంగా ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన తావులేకుండా కార్పొరేషన్ పరిధిలో అవసరం ఉన్న చోట్ల మోడ్రన్ టాయిలెట్లను ఏర్పాటు చేశాం. బహిరంగ మల విసర్జనకు స్వస్థి పలికి మూత్ర శాలలను, మరుగుదొడ్లను మాత్రమే వినియోగించుకోవాలి.
-మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ వెంకట్రెడ్డి
జనాభాకు అనుగుణంగా టాయిలెట్ల్లు ఏర్పాటు
పీర్జాదిగూడ కార్పొరేషన్లో రోజురోజుకు జనాభా పెరిగిపోతున్నది. ఇక్కడ ఉన్నవారే కాకుండా వివిధ పనులపై వచ్చే వారికి టాయిలెట్లు అందుబాటులో లేకపోవడం గమనించి ఇబ్బందులకు గురికాకుండా కార్పొరేషన్ పరిధిలో 13 టాయిలెట్లను ఏర్పాటు చేశాం.
-పీర్జాదిగూడ కార్పొరేషన్ డీ.ఈ శ్రీనివాస్