విద్యాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా వెనకబడిన మండలాల్లోని పేద, గ్రామీణ విద్యార్థులకు ఆంగ్లమాధ్యమంలో 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు కార్పొరేట్కు దీటుగా ఉచిత విద్యను అందించేందుకు మోడల్ స్కూళ్లను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాక విద్యార్థులకు కావాల్సిన పుస్తకాలు, రెండు జతల యూనిఫాంలు, మధ్యాహ్న భోజన వసతిని కల్పిస్తూ వారి తల్లిదండ్రులపై ఆర్థిక భారాన్ని తప్పిస్తున్నది. మోడల్ స్కూళ్లలో చదివే బాలికలకు మాత్రం హాస్టల్ వసతి కల్పిస్తున్నది. ఇదీగాక 6వ తరగతి విద్యార్థులకు పలు వృత్తి విద్యా కోర్సుల్లో తర్ఫీదు ఇస్తుండగా.. ఇంటర్ విద్యార్థులకు జేఈఈ, నీట్, ఎంసెట్ తదితర పోటీ పరీక్షలకు నిపుణుల ద్వారా ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నది. దీంతో ప్రతి సంవత్సరం వందలాది మంది విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభను కనబరుస్తున్నారు. పలు పేరొందిన ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలు పొందుతున్నారు. తమ భవితకు బంగారు బాటలు వేసుకుంటున్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా 194 మండల కేంద్రాల్లో మోడల్ స్కూళ్లు ఉండగా, గ్రేటర్ పరిధిలో 20 స్కూళ్లు ఉన్నాయి. అయితే ప్రస్తుత విద్యా సంవత్సరానికి (2021-22) మోడల్ స్కూళ్ల ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఏప్రిల్ 30లోగా దరఖాస్తులు స్వీకరించి.. జూన్లో ప్రవేశ పరీక్ష నిర్వహించి అర్హులను ఎంపిక చేయనున్నారు.