కొండాపూర్, అక్టోబర్ 1: జాతిపిత గాంధీజీ సిద్ధాంతాలు, ఆశయాలను కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రముఖ విద్యావేత్త, ఎమ్మెల్సీ వాణీదేవి అన్నారు. శుక్రవారం మాదాపూర్లోని శిల్పారామంలో గాంధీ జీవిత విశేషాలపై కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రీజినల్ ఔట్రిచ్ బ్యూరో(ఆరోఓబీ)నిర్వహిస్తున్న ఫొటో ప్రదర్శనను ఆమె ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ గాంధీజీ అనుసరించిన సత్యం, అహింస, స్వచ్ఛత, మహిళా అభ్యున్నతి, స్వయం పాలన వంటి సిద్ధాంతాలను నేటితరం తెలుసుకొని ఆచరించాలన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా గాంధీజీ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అనంతరం ‘గాంధీ మార్గం’ నాటకాన్ని ఆమె తిలకించారు.