హైదరాబాద్, మార్చి 25(నమస్తేతెలంగాణ): పెట్రోల్, డీజీల్, ఎల్పీజీ గ్యాస్ కొరతతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పేర్కొన్నారు. సరైన చర్యలు తీసుకొని భరోసా ఇవ్వాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం నెపం నెట్టుకుంటూ కాలయాపన చేస్తున్నాయని ఆరోపించారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్లో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్లతో కలిసి ఆయన మాట్లాడారు. అమెరికా, ఇరాన్ యుద్ధ నేపథ్యంలో మోదీ, రేవంత్ ప్రభుత్వాలు ముందుచూపుతో వ్యవహరించి అవసరాలకు తగిన ఇంధన నిల్వలు పెట్టుకుంటే ప్రజలు ఇంతగా ఇబ్బందిపడాల్సిన అవసరం ఉండేదికాదన్నారు.
ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే యూరియా కోసం రైతులు పడ్డ ఇబ్బందులు గుర్తుకువస్తున్నాయని చెప్పారు. గ్యాస్ సిలిండర్ల కోసం ప్రజలు తిండితిప్పలు మాని గ్యాస్ ఏజెన్సీల ఎదుట క్యూలు కడుతున్నారని పేర్కొన్నారు. ఇంధన కొరత తీర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో సమన్వయం చేసుకోవడంలో విఫలమైందని విమర్శించారు. పెట్రో ఉత్పత్తుల కోసం యుద్ధం జరుగుతున్న దేశాలు ఇబ్బందిపడటంలేదని, కానీ యుద్ధం జరగని దేశాలు ఇబ్బందిపడటం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఇంధన సమస్యకు పాలకుల ముందుచూపులేనితనమే కారణమని పునరుద్ఘాటించారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోబుచులాటలు మాని ఇంధన సమస్య పరిష్కారానికి చొరవచూపాలని హితవు పలికారు.
70 సార్లు ఢిల్లీ వెళ్లి ఏం సాధించారు..?
గ్యాస్, పెట్రోల్ కొరత వస్తుందేమోనని ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల పేర్కొన్నారు. కానీ ఇటీవ లి ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్రెడ్డి కేంద్ర మంత్రులను కలిసి ఈ సమస్యపై ప్రస్తావించకపోవడం బాధాకరమన్నారు. ముఖ్యమంత్రి రాజకీయ ప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తూ ప్రజలను గాలికొదిలేస్తున్నారని ఆరోపించారు. 70 సార్లు ఢిల్లీ టూర్లు చేసి సాధించిందేమీలేదని, తెచ్చిన నిధులు సున్నా అని చురకలంటించారు. ఇప్పటికైనా డైవర్షన్ పాలిటిక్స్ పక్కనబెట్టి ఇంధన కొరతతో ఇక్కట్లు పడుతున్న ప్రజానీకానికి విశ్వాసం కల్పించాలని సూచించారు.