దుండిగల్, నవంబర్ 27: నగర శివారు మున్సిపాలిటీలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాతే వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఎన్సీఎల్ పార్కు, ప్రజయ్ అపార్ట్మెంట్స్, ఉమా మహేశ్వర కాలని, వెన్సాయి, శ్వేత, శుభం, జయభేరి, శ్రీనివాస్నగర్ కాలనీ, కొంపల్లి విలేజ్, సెంట్రల్ పార్కు, దూలపల్లి ఎస్సీ కాలనీ, దూలపల్లి విలేజ్, ఎన్టీఆర్ విగ్రహం, 120 గజాలు, 60 గజాల ప్రాంతాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఈ తొమ్మిదిన్నరేండ్ల కాలంలో నగర శివారు మున్సిపాలిటీలకు పెద్ద ఎత్తున ప్రభుత్వం నిధులు కేటాయించింది. దీంతో గణనీయమైన అభివృద్ధి సాధించాయన్నారు. ఆయా మున్సిపాలిటీలలోని అన్ని కాలనీలు, బస్తీలల్లో మౌలిక వసతులైన సీసీ రోడ్డు, భూగర్భ్ర డైనేజీ, మంచినీటి సరఫరా, పార్కుల నిర్మాణం వంటి వసతులను కల్పించామని తెలిపారు. రానున్న రోజులల్లో ఆయా కాలనీలు, బస్తీలల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామన్నారు.
అదే సమయంలో అర్హులందరికి రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించినట్లు స్పష్టం చేశారు. భవిష్యత్లోనూ ఇదే తరహా అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలంటే ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈవీఎంలోని మూడో నంబర్లో ఉన్న కారుగుర్తుపై ఓటు వేసి హ్యాట్రిక్ విజయం అందించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్, వైస్ చైర్మన్ గంగయ్య నాయక్, కొంపల్లి మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ప్రభాకర్రెడ్డితో పాటు పలువురు కౌన్సిలర్లు, నేత లు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.