నగరంలోని కంటోన్మెంట్ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువతీ యువకుల సంక్షేమం కోసం ఎస్సీ యాక్షన్ ప్లాన్ 2020-21 ఆర్థిక సంవత్సరానికిగాను రాష్ట్ర ప్రభుత్వం రూ.6.25 కోట్ల అదనపు బడ్జెట్ను మంజూరు చేసిందని స్థానిక ఎమ్మెల్యే సాయన్న అన్నారు. ఈ క్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ రమేశ్ మంగళవారం ఎమ్మెల్యే సాయన్నను కాకాగూడలోని ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ బడ్జెట్ ద్వారా నిరుద్యోగులకు ఉపాధిని కల్పించేందుకుగాను రుణాలను మంజూరు చేయనున్నట్లు తెలిపారు. 21 నుంచి 50 సంవత్సరాలలోపు వయస్సు కలిగిన వారు అర్హులని పేర్కొన్నారు.
రుణాల మంజూరులో మహిళలు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు ప్రాధాన్యతను కల్పించనున్నామన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు కుల, ఆదాయ ధృవీకరణపత్రాలతో పాటు ఆధార్, రేషన్కార్డులతోపాటు వృత్తి నైపుణ్యం కలిగినవారు అనుభవ ధృవీకరణపత్రాలతో సెప్టెంబరు 15 లోపు కార్పొరేషన్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. టీస్టాళ్లు, కాఫీ దుకాణాలు, డ్రైఫ్రూట్స్, ఆర్గానిక్ కూరగాయలు, పండ్ల దుకాణాలు, మొబైల్ పాల పార్లర్లు, బేకరీ, బోటిక్లు, జ్యూస్, టిఫిన్ సెంటర్లు తదితర వ్యాపారాలను ఏర్పాటు చేసుకోవాలనుకునేవారికి రూ. లక్ష నుంచి రూ. 5 లక్షల వరకు సుమారు 200 లమందికి రుణాలను మంజూరు చేయనున్నామని తెలిపారు.
వివిధ వ్యాపారాలు, వృత్తి నైపుణ్యంలో అనుభవం కలిగినవారికి సైతం రుణాలను మంజూరు చేయనున్నామన్నారు. రూ. లక్ష రుణం పొందేవారికి కార్పొరేషన్ ద్వారా 80 శాతం, రూ. లక్ష నుంచి రూ.2లక్షలు పొందేవారికి 70శాతం, రూ.2లక్షలు ఆపైన రుణాలను పొందేవారికి కార్పొరేషన్ ద్వారా 60 శాతం సబ్సిడీని కల్పించనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ఎస్సీ వర్గానికి చెందిన నిరుద్యోగ యువతీ, యువకులు సద్వినియో గం చేసుకోవాలని ఎమ్మె ల్యే, ఈడీలు సూచించారు.