కంటోన్మెంట్, ఆగస్టు 12: రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి , షాదీముబారక్ పథకాలు పేద కుటుంబాలకు అండగా నిలుస్తున్నదని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. బోర్డు పరిధిలోని మూడో వార్డు బాలంరాయి కమ్యూనిటీ హాల్లో పలు ప్రాంతాలకు చెందిన 9 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద సుమారు రూ. 9లక్షల ఒక వెయ్యి 44 మంజూరయ్యాయి. గురువారం నిర్వహించిన కార్యక్రమంలోఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొని సంబంధిత లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా సాయన్న మాట్లాడుతూ ఆడబిడ్డల తల్లిదండ్రులకు అండగా నిలిచేందుకు సీఎం కేసీఆర్ కల్యాణ లక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నారని వివరించారు. త్వరలోనే రాష్ట్ర వ్యా ప్తంగా అమలు కానున్న దళిత బంధు పథకంతో ప్రతి దళితుడు ఆర్థికంగా ఎదుగనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బోయిన్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్, బోర్డు మాజీ సభ్యుడు ప్రభాకర్, మార్కెట్ డైరెక్టర్ దేవులపల్లి శ్రీనివాస్, నేతలు నివేదిత, సంతోష్, పిట్ల నగేష్ తదితరులు పాల్గొన్నారు.