మణికొండ/బండ్లగూడ, జూన్ 16 : పట్టణప్రగతితో అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ పేర్కొన్నారు. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్, నార్సింగి, మణికొండ మున్సిపాలిటీల్లో పట్టణప్రగతి కార్యక్రమాన్ని అధికారులు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై డ్వాక్రా గ్రూప్ మహిళలకు చెక్కుల పంపిణీ, పారిశుధ్య కార్మికులకు కిట్లు పంపిణీ చేశారు. అనంతరం బండ్లగూడలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పట్టణప్రగతిలో భాగంగా మున్సిపాలిటీల్లో పార్కులు, వైకుంఠధామాలు, నర్సరీల పెంపకం, రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటడం, ఇంటిగ్రేటెడ్ మార్కెట్లను ఏర్పాటు చేసుకోవడం అనేక పనులతో అభివృద్ధి పరుచుకోవడం జరిగిందన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాల ద్వారా అభివృద్ధితో పాటు సమస్యల పరిష్కారానికి దోహదపడుతుందన్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులను కల్పిస్తున్నారన్నారు. పట్టణప్రగతిలో వేలాది కోట్ల రూపాయలను వెచ్చించి రోడ్ల విస్తరణ, కాల్వల నిర్మాణం, వీధి దీపాలు, క్రీడా ప్రాంగణాలు తదితర నిర్మాణాలను ప్రభుత్వం చేపడుతుందన్నారు. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ మహేందర్గౌడ్, డిప్యూటీ మేయర్ రాజేందర్రెడ్డి, నార్సింగి మున్సిపల్ చైర్పర్సన్ రేఖాయాదగిరి, వైస్ చైర్మన్ వెంకటేశ్ యాదవ్, మణికొండ మున్సిపాలిటీ చైర్మన్ కస్తూరి నరేందర్, కమిషనర్లు వేణుగోపాల్రెడ్డి, సత్యబాబు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.