ఇవే బీజేపీ ప్రభుత్వ విధానాలు
అగ్నిపథ్పై అనాలోచిత నిర్ణయం
ఎమ్మెల్యే దానం నాగేందర్
హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): పాక్.. ఫేక్.. బ్రేక్ ఇవే బీజేపీ విధానాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆరోపించారు. ఎవరినీ సంప్రదించకుండా దేశభద్రత విషయంలో ప్రధాని మోదీ అనాలోచిత నిర్ణయం తీసుకొని అగ్నిపథ్ను తెచ్చారని ఆయన ధ్వజమెత్తారు. కేంద్రం ఇప్పటికైనా అగ్నిపథ్ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. శనివారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరిగిన సంఘటన దురదృష్టకరమన్నారు. పాకిస్తాన్ పేరు చెప్పి రెచ్చగొట్టడం, అసత్య ప్రచారాలు చేయటం, కులం మతం పేరుతో విధ్వంసం సృష్టించటమే బీజేపీ విధానాలుగా మారాయని ఆయన ధ్వజమెత్తారు. కొన్ని సంవత్సరాలుగా సైన్యంలో నియామకాలు చేపట్టకుండా కాలయాపన చేసిన కేంద్రం ఉన్నపళంగా అగ్నిపథ్ విధానాన్ని తేవడం దారుణమన్నారు. దేశ రక్షణలో అత్యంత కీలకమైన సైనిక నియామక ప్రక్రియను అసంబద్ధంగా, అనాలోచితంగా చేయటం దుర్మార్గమన్నారు.
సికింద్రాబాద్లో రైల్వే స్టేషన్లో జరిగిన ఘటనను టీఆర్ఎస్కు ముడిపెట్టడం బండి సంజయ్ అవివేకానికి నిదర్శమన్నారు. కిషన్రెడ్డి తానో కేంద్రమంత్రి అనే విషయాన్ని మరచిపోయి రాష్ట్ర ప్రభుత్వంపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆర్మీ ఉద్యోగార్థులు తెలంగాణలో మాత్రమే ఆందోళన చేయలేదని, దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లే లక్ష్యంగా తమ నిరసన తెలుపుతున్నారని.. అయితే అక్కడ కూడా టీఆర్ఎస్ పాత్ర ఉందా అని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఎట్టిపరిస్థితుల్లో టీఆర్ఎస్ హింసను ప్రోత్సహించదని.. శాంతిభద్రతల విషయంలో సీఎం కేసీఆర్ అత్యంత కఠినంగా ఉంటారని ఆయన చెప్పారు. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం తెలంగాణలో ఎక్కడా హింసాత్మక ఘటనలు జరగలేదని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా యువత ఆందోళన చెందటానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే కారణమన్నారు. అగ్నిపథ్పై ప్రధాని అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని దానం నాగేందర్ డిమాండ్ చేశారు. 8 ఏండ్లుగా ప్రధాని మోదీ తెచ్చి న ఏ పథకం విజయవంతం కాలేదని ఆయన గుర్తుచేశారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఆర్పీఎఫ్ కాల్పుల్లో వరంగల్ జిల్లాకు చెందిన ఆర్మీ ఉద్యోగార్థి రాకేశ్ మరణించటం బాధాకరమన్నారు. రాకేశ్ కుటుంబాన్ని అన్ని విధాలా అండగా ఉంటామని సీఎం కేసీఆర్ ప్రకటించారని, మృతుడి కుటుంబానికి రూ. 25 లక్షల ఆర్థిక సహాయం, ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యో గం కల్పిస్తామని హామీ ఇవ్వటం టీఆర్ఎస్ మానవీయ పాలనకు నిదర్శమన్నారు. అలాగే శనివారం ప్రధాని మోదీ తన జన్మదినం సందర్భంగా దేశంలో ఏ తల్లికి పుత్రశోకం మిగల్చకూడదని ఆయన సూచించారు.