మల్కాజిగిరి, అక్టోబర్ 26: ప్రజలకు మెరుగైన వైద్యసేవలే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా అల్వాల్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అన్ని సౌకర్యాలు కల్పించింది..దీంతో అల్వాల్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాకుండా పలు ప్రాంతాల నుంచి కూడా వైద్యం కోసం వస్తున్నారు. వైద్యలు ప్రతి రోగిని పరీక్షించి.. వైద్య సేవలు అందిస్తున్నారు. గతంలో రోజుకు 50 మంది వచ్చే రోగులు.. ఇప్పుడు 200లకు పైగా వస్తున్నారు. ఇక్కడ పిల్లలకు టీకాలతో పాటు ఇతర వ్యాధులకు ఉచితంగా చికిత్సలు అందిస్తున్నారు. ప్రసవాలతో పాటు రూ.12వేల విలువగల కేసీఆర్ కిట్ను ఉచితంగా అందజేస్తున్నారు. గర్భవతిగా తమ పేర్లను నమోదుచేసుకున్న తర్వాత విడతల వారీగా మగబిడ్డ పుడితే రూ.12వేలు, ఆడ బిడ్డ పుడితే రూ.13వేల ఆర్థిక సహాయాన్ని అంద జేస్తున్నారు. దాదాపు ప్రతి నెల 40వరకు ప్రసవాలు , ప్రతి మంగళవారం కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు వ్యాక్సినేషన్తో పాటు కరోనా పరీక్షలు చేస్తున్నారు.
1955లో అల్వాల్ గ్రామంగా ఉన్నప్పుడు స్థానిక దాత ఒకరు తన నివాస గృహాన్ని దవాఖానకు విరాళంగా ఇచ్చారు. ఈ భవనంలోని గదులను ఒక్కో విభాగానికి కేటాయించారు. ప్రస్తుతం శిథిలావస్థకు చేరిన భవనానికి మరమ్మతులు చేసి ఉపయోగిస్తున్నారు. కొత్తగా దవాఖాన భవనాన్ని నిర్మించాలని ప్రతిపాదనలు చేశారు. ప్రస్తుతం రోగ నిర్ధారణ కేంద్రం, విశ్రాంతి గదుల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం వెంకటాపురం అంబేద్కర్ కమ్యూనిటీహాల్లో బస్తీ దవాఖాన, సుభాష్నగర్లో పట్టణ ఆరోగ్య కేంద్రం, మచ్చ బొల్లారంలోని ఆరోగ్య కేంద్రం ద్వారా వైద్య సేవలు అందిస్తున్నారు.
అల్వాల్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే ఇక్కడ ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. వ్యాక్సినేషన్, కరోనా పరీక్షలు జరుగుతున్నాయి. ఉచితంగా వైద్య సేవలు అందుబాటులో ఉండటంతో.. ప్రతి రోజు దవాఖానకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతుంది. మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. కొత్త భవనం కట్టడానికి గతంలో పంపిన ప్రతిపాదనలు పరిశీలించి.. అవసరమైతే కొత్త ప్రతిపాదనలు సిద్ధంచేసి ప్రభుత్వానికి నివేదిస్తాం. ప్రజల ఆరోగ్యమే ప్రధాన లక్ష్యంగా సేవలందించడం హర్షణీయం. – మైనంపల్లి హన్మంతరావు, ఎమ్మెల్యే