ముషీరాబాద్, నవంబర్ 28: ఇంటి పక్కన ఉండి పిలిస్తే పలికే నేత కావాలో..? పాత బస్తీ నేత కావాలో? ముషీరాబాద్ నియోజకవర్గం ప్రజలకు తెలుసునని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ముఠా గోపాల్ అన్నారు. నిత్యం జనం మధ్య ఉండి వారి సమస్యల పరిష్కారం కోసం పని చేస్తున్న తనను మరో మారు ఎమ్మెల్యేగా గెలిపించుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, చుట్టపు చూపులా వచ్చిపోయే నేతలను ఆదరించబోరని స్పష్టం చేశారు. ఈ నెల 30న జరిగే శాసన సభ ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించబోతున్నట్లు చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు రెండు, మూడు స్థానాల కోసం పోటీ పడుతున్నారని అన్నారు.
మంగళవారం ఎన్నికల ప్రచారం ముగిసిన అనంతరం, ముఠా గోపాల్ నమస్తే తెలంగాణతో మాట్లాడుతూ గడిచిన ఐదేళ్లుగా నిత్యం జనం మధ్య ఉంటూ బస్తీలు, కాలనీల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం శక్తి వంచన లేకుండా పని చేశానని, వెయ్యి కోట్లకు పైగా నిధులు తీసుకువచ్చి అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. నియోజకవర్గంలో దాదాపు లక్ష మందికిపైగా ప్రజలకు సంక్షేమ ఫలాలు, పెన్షన్లు అందించడం జరిగిందని, గతంలో ఏ ఎమ్మెల్యే చేయలేనంతగా ముషీరాబాద్ను అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లానని అన్నారు.
ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి విశేష స్పందన లభించిదని ముఠా గోపాల్ తెలిపారు. ప్రతి ఇంటిలో ఏదో రకంగా బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి లబ్ధిపొందిన వారున్నారు. సంక్షేమ సర్కారు మళ్లీ రావాలని ప్రజలు కోరుకుటున్నారని అన్నారు. ప్రతి బస్తీ, కాలనీలో చేసిన అభివృద్ధినే వారే తిరిగి మాకు గుర్తు చేస్తున్నారని, రోడ్లు, మంచినీరు, డ్రైనేజీ సమస్యలు పరిష్కరించడంతో పాటు నిరంతరాయంగా కరెంటు సరఫరా, మంచినీరు అందిస్తున్న కేసీఆర్ సక్కారు ఆదరిస్తామని హామీ ఇస్తున్నారని తెలిపారు. అభివృద్ది, సంక్షేమం కోసం పాటుపడుతున్న తనను గెలిపించుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.
నియోజకవర్గంలో శిథిలావస్థలో ఉన్న డ్రైనేజీ పైపులైన్ల మార్పిడి, మంచినీటి పైపులైన్ల ఏర్పాటు, కలుషిత నీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. పద్మకాలనీలో వరద నీటి సమస్యకు శాశ్వతంగా పరిష్కారం, సబర్మతీనగర్, అరుంధతీనగర్, అశోక్నగర్ ప్రాంతాల్లో హుస్సేన్ సాగర్ వరద సమస్య తలెత్తకుండా ప్రహరీ నిర్మాణ పనులు పూర్తి చేయనున్నట్లు తెలిపారు.