కవాడిగూడ, ఏప్రిల్ 26: కవాడిగూడ డివిజన్ పరిధిలో నెలకొన్న కలుషిత నీటి సరఫరా సమస్యను అరికట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ జలమండలి అధికారులను ఆదేశించారు. కవాడిగూడ డివిజన్ పరిధిలోని దోమలగూడ మున్సిపల్ క్వార్టర్స్, ఈశ్వరమ్మబాడ, వినాయక్నగర్, ఎల్ఐసీ కాలనీ తదితర బస్తీలలో ఆదివారం ఎమ్మెల్యే ముఠాగోపాల్ పర్యటించారు. నల్లాల్లో కలుషిత నీటిసరఫరా జరుగుతోందని జలమండలి అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని బస్తీలవాసులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. మున్సిపల్ క్వార్టర్స్లో ఇళ్లమధ్యలో ఉన్న విద్యుత్ స్థంబాలను తొలగించాలని, ఈశ్వరమ్మబాడలో ఇళ్లను ఆనుకుని ఉన్న విద్యుత్ స్థంబాలను మార్చాలని ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు.
పార్కులో కనీస సౌకర్యాలు కల్పించాలని నిరుపయోగంగా మారిన ఓపెన్ జిమ్ పరికరాలకు మరమ్మతులు చేయించాలని, పార్కు చుట్టూరా ప్రహరీ ఏర్పాటు చేయడంతో పాటు పార్కులో కుర్చీలు ఏర్పాటు చేయించాలని ఎల్ఐసీ కాలనీవాసులు ఎమ్మెల్యేను కోరారు. ఎమ్మెల్యే ముఠాగోపాల్ మాట్లాడుతూ.. స్థానికులు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను త్వరితగతిన పరిష్కనిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యువనాయకుడు ముఠా జయసింహ, కవాడిగూడ డివిజన్ అధ్యక్షుడు వల్లాల శ్యామ్యాదవ్, మున్సిపల్ క్వార్టర్స్ బస్తీ చైర్మన్ శాంతికుమార్, ప్రభాకర్, ఈశ్వరమ్మ బాడ బస్తీ నాయకులు చితల హరీష్యాదవ్, కుమార్యాదవ్, జగన్గౌడ్, సంతోష్, రాజు, మహేందర్, రమాకాంత్ తదితరులు
పాల్గొన్నారు.