Hyderabad | బీఆర్ఎస్ హయాంలోనే ముషీరాబాద్ నియోజకవర్గం అభివృద్ధి చెందిందని, తమ కంటే ఎక్కువ అభివృద్ధి ఇతర నాయకులు చేసినట్లు నిరూపిస్తే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. కవాడిగూడ డివిజన్ లోయర్ ట్యాంక్బండ్లోని ఆర్ కన్వెన్షన్ సెంటర్లో సోమవారం జరిగిన ఆత్మీయ సమావేశంలో ఆయన కార్యకర్తలతో కలిసి ఆడిపాడారు. అనంతరం వృద్ధులతో కలిసి భోజనం చేశారు. నాగోలు కాత్యాయినీ గార్డెన్లో జరిగిన ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్రెడ్డి, ఎమ్మెల్సీ దయానంద్గుప్తా హాజరయ్యారు. అమీర్పేట జీహెచ్ఎంసీ మైదానంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పాల్గొన్నారు. పని చేసే నాయకులకే ప్రజలు పట్టం కట్టాలని వారు పిలుపునిచ్చారు.
కవాడిగూడ, మార్చి 27: ముషీరాబాద్ నియోజక వర్గంలో బీఆర్ఎస్ హయాంలోనే అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగిందని, తాము చేసిన అభివృద్ధి కంటే ఎక్కువ చేసినట్లు ఏ ప్రజా ప్రతినిధి అయినా నిరూపిస్తే వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రతిపక్ష నేతలకు సవాల్ విసిరారు. సోమవారం కవాడిగూడ డివిజన్ లోయర్ ట్యాంక్బండ్లోని ఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, బీఆర్ఎస్ సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్ మొదటగా బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభకు అధ్యక్షత వహించిన రాష్ట్ర యువజన విభాగం నాయకుడు ముఠా జయసింహ ముషీరాబాద్ నియోజక వర్గంలో నాలుగేండ్ల కాలంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ యావత్ భారతదేశంలో ఎక్కడా జరగని అభివృద్ధి తెలంగాణ రాష్ట్రంలో జరిగిందన్నారు.
కేంద్రం పెట్రోల్, డీజిల్, నిత్యావసర ధరలు పెంచిందని, జాతీయ మహిళా దినోత్సవం రోజే గ్యాస్ సిలిండర్ ధరలను పెంచి మహిళలను అవమానించారని ఎమ్మెల్యే ముఠా గోపాల్ మండిపడ్డారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం స్టీల్ బ్రిడ్జి నిర్మాణంతో పాటు అంతర్గత రోడ్లను ఆధునీకరించినట్లు తెలిపారు. హుస్సేన్సాగర్ నాలా పరివాహక ప్రాంతంలో నివాసముంటున్న లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రహరీ నిర్మాణ విషయంలో చాలామంది ఇండ్లు కోల్పోయే ప్రమాదం ఉంటే.. స్వయంగా తాను మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి ఎలాంటి నష్టం జరగకుండా తన వంతు కృషి చేసినట్లు చెప్పారు. నియోజకవర్గంలో పురాతన డ్రైనేజీ, మంచినీటి పైప్లైన్లను తొలగించి.. జనాభాకు అనుగుణంగా పైప్లైన్ల ఆధునీకరణకు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. సాగర్ నాలాతో పాటు పద్మకాలనీలో ఉన్న కచ్చామోరీ నాలా ప్రహరీ, నల్లపోచమ్మ దేవాలయం వద్ద నాలా ప్రహరీ స్లాబ్ నిర్మాణాలు చేపట్టినట్లు చెప్పారు.
బీఆర్ఎస్ సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లి బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ను ప్రధానిని చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ కమిషన్ మాజీ వైస్ చైర్మన్ శంకర్ లూక్, మాజీ కార్పొరేటర్లు టి. రవీందర్, ముఠా పద్మ నరేశ్, మాచర్ల పద్మజా, కవాడిగూడ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు వల్లాల శ్యామ్ యాదవ్, ఎన్డీ సాయికృష్ణ, రాష్ట్ర నాయకుడు కల్వగోపీ, నియోజకవర్గంలోని వివిధ డివిజన్ల అధ్యక్ష, కార్యదర్శులు వై. శ్రీనివాస్ రావు, రాకేశ్ కుమార్, ఆర్. మోజెస్, నర్సింగ్ ప్రసాద్, శ్రీనివాస్రెడ్డి, నాయకులు వల్లాల శ్రీనివాస్ యాదవ్, డివిజన్ మాజీ అధ్యక్షుడు కాటారం దినేశ్, సానం చంద్రశేఖర్ గౌడ్, పెంటారెడ్డి, ఎస్. యాదగిరి, ముకుందరెడ్డి, ముఠా నరేశ్, రాంచందర్, గోవింద్, దుర్గ స్వామి, ప్రవీణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఆత్మీయ సమ్మేళనంలో మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా బతుకమ్మ ఆడారు. మహిళలతో పాటు ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ బతుకమ్మ ఆడి సందడి చేశారు.