ముషీరాబాద్, అక్టోబర్ 28: శ్మశానవాటికల్లో కనీస సౌకర్యాలు కల్పించడానికి వెంటనే చర్యలు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని శ్మశాన వాటికలను పరిశీలించి సౌకర్యాల కల్పన కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన ముషీరాబాద్ డివిజన్ పార్శిగుట్టలోని గంగపుత్ర, ముదిరాజ్, దళిత శ్మశాన వాటికలను అధికారులతో కలిసి పరిశీలించారు. శ్మశాన వాటికలలో సమస్యలు, కనీస వసతుల తీరును వాకబు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దీపావళి పర్వదినం నాటికి అన్ని శ్మశాన వాటికల్లో పిచ్చిమొక్కలు, చెత్తా చెదారం తొలగింపు పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పార్శిగుట్ట శ్మశాన వాటికల వద్ద అక్రమ పార్కింగ్లను తొలగించడంతోపాటు శిథిలావస్థలో ఉన్న ప్రహరీలను తొలగించి కొత్త ప్రహరీలను నిర్మించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ సర్కిల్-15 ఏఎంహెచ్ఓ మైత్రేయి, డీఈ సన్నీ, ఏఈ తిరుపతి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఠా జయసింహ, ముషీరాబాద్ టీఆర్ఎస్ అధ్యక్షుడు కాడబోయిన నర్సింగ్ ప్రసాదవ్, గోవింద్, బీజేపీ నాయకులు ఎం. నవీన్గౌడ్, కంచి, గంగపుత్ర సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.