ముషీరాబాద్, సెప్టెంబర్ 8: ముషీరాబాద్ డివిజన్ చేపల మార్కెట్లో డ్రైనేజీ పైపులైన్, మ్యాన్హోళ్ల నిర్మాణ పనులను నిర్లక్ష్యం చేయడం పట్ల ఎమ్మెల్యే ముఠా గోపాల్ అధికారులపై మండిపడ్డారు. మ్యాన్హోళ్ల మూతలు ఏర్పాటు చేసి నెల రోజులకే విరిగిపోవడం, నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ముషీరాబాద్ చేపల మార్కెట్లో అధికారులతో కలిసి పర్యటించారు. మార్కెట్లో సౌకర్యాల తీరును పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చేపల మార్కెట్కు వచ్చే ప్రజలకు ఇబ్బం దులు కలుగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
చేపల వ్యర్థాలను ఎప్పటికప్పుడూ తొలగించడంతో పాటు మురుగు నీటి లీకేజీ సమస్యలు తలెత్తకుండా జలమండలి, జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకోవాలని, చేపల మార్కెట్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. రోడ్లపై వర్షపు నీరు నిలిచి ఉండకుండా చూడాలని, విరిగిన మ్యాన్హోళ్ల స్థానంలో వెంటనే కొత్తవి ఏర్పాటు చేయాల్సిందిగా చెప్పా రు. మార్కెట్ పరిసరాల్లో గంజాయి సేవించడం వంటి అసాంఘీక కార్యకలాపాలకు అడ్డుకుట్టవేయాలని పోలీసులకు సూచించారు.
దుర్ఘంధ సమస్య తలెత్తకుండా ఎప్పటికప్పుడూ చెత్త, చేపల వ్యర్థాల తరలింపు చేపట్టాలని, పారిశుధ్య సమస్య తలెత్తకుండా వ్యాపారులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జలమండలి మేనేజర్ కృష్ణమోహన్, గంగపుత్ర సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ, టీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఠా జయసింహ, వి.సుధాకర్గుప్త, ఆర్.మోజస్, దీన్దయాల్రెడ్డి, సాంబశివరావు, లక్ష్మణ్గౌడ్, డి.శివముదిరాజ్, నేత శ్రీనివాస్, సయ్యద్ అస్లాం, ఎయిర్టెల్ రాజు తదితరులు పాల్గొన్నారు.