ముషీరాబాద్, ఆగస్టు 26: ముషీరాబాద్ డివిజన్ ఆదర్శకాలనీ డ్రైనేజీ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ జలమండలి అధికారులను ఆదేశించారు. డ్రైనేజీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికిగాను వెంటనే కొత్త పైపులై పనులు మొదలు పెట్టాలని సూచించారు. గురువారం ఆదర్శకాలనీలో జలమండలి అధికారులతో కలిసి పర్యటించిన ఎమ్మెల్యే డ్రైనేజీ నీటి లీకేజీ సమస్య తీరును చూసి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు ప్రజ లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోతే ఎలా ? అని మండిపడ్డారు. తాగు నీరు, మురుగు నీటి సమస్యల పరిష్కారం పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఆదర్శనగర్లో డ్రైనేజీ సమస్యను శాశ్వత ప్రతిపాదికన పరిష్కరించడానికి రూ. 33 లక్షలు మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. త్వరలో పైపులైన్ ఏర్పాటు పనులు ప్రారంభించనున్నట్లు ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జలమండలి జీఎం సుబ్బారాయుడు, డీజీఎం వాహబ్, మేనేజర్ రమణ, టీఆర్ఎస్ నాయకులు సాంబశివరావు, లక్ష్మణ్గౌడ్, రాజు, భిక్షపతి, శివముదిరాజ్, వెంకటేశ్, శ్రీనివాస్, రజిని, శ్రీకాంత్గౌడ్ పాల్గొన్నారు.