ఎల్బీనగర్, ఫిబ్రవరి 10: సరూర్నగర్ స్టేడియంలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాకు హాజరయ్యే అభ్యర్థులకు, కంపెనీల ప్రతినిధులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా వలంటీర్లు విధులను నిర్వహించాలని ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి సూచించారు. శనివారం వలంటీర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలోనే అతిపెద్ద మెగా జాబ్మేళాను సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్నామన్నారు.
జామ్ వేళాకు ఇప్పటికే ఆన్లైన్లో 20 వేల మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారని, శనివారం నేరుగా మరో పది వేల మంది వరకు అభ్యర్థులు వచ్చేందుకు అవకాశం ఉందన్నారు. జాబ్మేళాకు వేల సంఖ్యలో అభ్యర్థులు,కంపెనీల ప్రతినిధులు వచ్చే అవకాశం ఉన్నందున వలంటీర్లు ఇటు అభ్యర్థులకు, అటు కంపెనీల ప్రతినిధులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా విధులను నిర్వహించాలని ఆయన సూచించారు. ప్రతి ఐదు స్టాళ్లకు ఒక వలంటీర్ ఉండటంతో పాటుగా ఏ స్టాల్లోనూ ఎక్కడా రద్దీ లేకుండా చూసుకోవాలని, ఏ క్వాలిఫికేషన్ ఉన్న అభ్యర్థులు ఏ స్టాల్కు వెళ్లాలో తెలియజేయడంతో పాటుగా జాబ్మేళా సక్సెస్లో వలంటీర్లు ప్రధాన భూమిక పోషించాలన్నారు.
జాబ్ మేళా ద్వారా 130 కంపెనీలు ప్రాతినిధ్యం కల్పిస్తున్న నేపథ్యంలో ముందుగా పదివేల ఉద్యోగాలు కల్పించేందుకు అనుకున్నా మరికొన్ని కంపెనీలు ముందుకు రావడంతో సుమారు 13 వేల ఉద్యోగాలు అభ్యర్థులకు దక్కనున్నాయని ఆయన తెలిపారు. ఏడో తరగతి మొదలుకుని పీజీ చేసిన అభ్యర్థులకు తగిన విధంగా ఉద్యోగాలు అందుబాటులో ఉండే విధంగా సరూర్నగర్ స్టేడియం మైదానానికి అన్ని కంపెనీలను తీసుకుని వచ్చామన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గంతో పాటుగా పరిసరాల నిరుద్యోగులు ఈ మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకుని తల్లిదండ్రుల కలలను నెరవేర్చాలని ఆయన సూచించారు. ప్రధానంగా మూగ, చెవిటి, అంధ, వికలాంగుల అభ్యర్థులతో పాటుగా ట్రాన్స్జెండర్లకు కూడా ఉద్యోగ అవకాశాలున్నాయని ఆయన తెలిపారు.
ఎల్బీనగర్, ఫిబ్రవరి 10: ఎల్బీనగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం ఈ నెల 13న ఉదయం 9 గంటలకు మన్సూరాబాద్ డివిజన్ సహారా రోడ్డులోని ఎంఈ రెడ్డి గార్డెన్స్లో జరుగుతుందని ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. ఫిబ్రవరి 17న సీఎం కేసీఆర్ జన్మదినం, తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభోత్సవం, అనంతరం పరేడ్ గ్రౌండ్స్ భారీ బహిరంగ సభ నేపథ్యంలో ఎల్బీనగర్ నియోజకవర్గంలోని కార్యకర్తలను సమాయాత్తం చేసేందుకు కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఇట్టి సమావేశానికి నియోజకవర్గంలోని అన్ని డివిజన్ల కార్యకర్తలతో పాటుగా నాయకులు, సానుభూతిపరులు, ఉద్యమకారులు అందరూ పెద్ద ఎత్తున హజరుకావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమానికి ఎల్బీనగర్ నియోజకవర్గం ఇన్చార్జి ఎమ్మెల్సీ కౌశిక్రెడ్డి హాజరవుతారని ఆయన తెలిపారు.