బంజారాహిల్స్, అక్టోబర్ 19 : తొమ్మిదిన్నర ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే రానున్న ఎన్నికల్లో హైదరాబాద్ జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాయని జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ధీమా వ్యక్తం చేశారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో గులాబీ జెండా ఎగురవేస్తామని అన్నారు. గురువారం జూబ్లీహిల్స్లోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాగంటి గోపీనాథ్ మాట్లాడారు.
బీఆర్ఎస్ మ్యానిఫెస్టోపై ప్రజల్లో అద్భుతమైన స్పందన లభిస్తుందన్నారు. గ్రేటర్ పరిధిలో ఇటీవల డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ అత్యంత పారదర్శకంగా జరిగిందని, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో మరో లక్ష డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మిస్తామని చెప్పడం సంతోషంగా ఉందన్నారు. నియోజకవర్గానికి 3వేలమందికి గృహలక్ష్మి పథకం కింద రూ.3లక్షల సాయం అందించేందుకు ప్రొసీడింగ్స్ అందించినట్లు తెలిపారు. హైదరాబాద్ జిల్లాలో ప్రస్తుతం గోషామహల్ మినహా అన్ని సీట్లలో బీఆర్ఎస్తో పాటు ఫ్రెండ్లీ పార్టీ ఎంఐఎం ఎమ్మెల్యేలు ఉన్నారని, రానున్న ఎన్నికల్లో గోషామహల్ సీటును కూడా గెలుచుకొని క్లీన్ స్వీప్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్ ఎంపీగా గెలిచి కేంద్రమంత్రిగా పనిచేస్తున్న కిషన్రెడ్డి హైదరాబాద్ జిల్లాకు చేసింది ఏమీ లేదన్న విషయాన్ని ప్రజలు గుర్తించారన్నారు. కరోనా కష్టకాలంలో జిల్లాలోని అందరూ ఎమ్మెల్యేలు పేదల కోసం నిత్యావసర వస్తువులు, ఆహారం పంపిణీ చేస్తుంటే కేంద్రమంత్రిగా ఉన్న కిషన్రెడ్డి మాత్రం కుర్కురే ప్యాకెట్లు పంపిణీ చేసిన విషయాన్ని నగర ప్రజలు మర్చిపోలేదన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అనేక ఫ్లై ఓవర్ల నిర్మాణం పూర్తిచేసి ట్రాఫిక్ కష్టాలు తీర్చామని, కేంద్ర ప్రభుత్వం హయాంలో చేపట్టిన ఉప్పల్, అంబర్పేట ఫ్లై ఓవర్లు ఇప్పటికీ పూర్తికాకపోవడం బీజేపీ కేంద్రమంత్రి కిషన్రెడ్డి అసమర్థతకు నిదర్శనంగా నిలుస్తున్నాయన్నారు.
హైదరాబాద్ నగరంలోని పేదలంతా సంక్షేమ పథకాలు అందిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్నారని, ఉన్నత విద్యావంతులు, వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు గత తొమ్మిదిన్నర ఏళ్లలో మంత్రి కేటీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ సాధిస్తున్న అభివృద్ధికి మద్దతు పలుకుతారన్నారు. పదేళ్ల కిందట హైదరాబాద్లో ఉన్న కరెంట్, ట్రాఫిక్, మంచినీటి కష్టాలు, మత కల్లోలాలు బీఆర్ఎస్ పాలనలో మాయమయ్యాయని తెలిపారు.
ప్రపంచంలోనే హైదరాబాద్ నగరానికి మోస్ట్ లివబుల్ సిటీగా గుర్తింపు తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందన్నారు. మంత్రి కేటీఆర్ నాయకత్వంలో హైదరాబాద్కు ఎన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు వచ్చాయని, ప్రజలంతా సంతోషంగా ఉన్నారని అన్నారు. ఇటీవల విడుదల చేసిన బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో ప్రకటించిన సౌభాగ్యలక్ష్మి, సన్నబియ్యం, కేసీఆర్ ఆరోగ్య భీమా, రూ.5లక్షల జీవిత భీమా తదితర పథకాలపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు.