కేపీహెచ్బీ కాలనీ, జూన్ 11 : ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శుక్రవారం కూకట్పల్లి పట్టణ ఆరోగ్య కేంద్రం లో ఈసీజీ.. ఎక్స్రే అల్ట్రాసౌండ్ లాంటి 57 రకాల వైద్య పరీక్షలకు చెందిన డయాగ్నస్టిక్ సెంటర్ ఏర్పాటు పనులకు ఎమ్మెల్యే కృష్ణారావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం ఉచితంగా రోగ నిర్ధారణ చేయడం కోసం ఈ సెంటర్లను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. ఈ సెంటర్లలో 57రకాల వైద్య పరీక్షలు ప్రజలకు ఉచితంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రజల కష్టాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఆయా జిల్లా కేంద్రాలతో పాటు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో డయాగ్నస్టిక్ సెంటర్లను అందుబాటులోకి తెస్తుందని తెలిపారు.
ఈ సెంటర్లలో రక్త, మల, మూత్ర పరీక్షలతో పాటు వీటికి అనుబంధంగా ఉండే వంద రకాల పరీక్షలను ఉచితంగా చేస్తుందన్నారు. ఆన్లైన్లో పరీక్షల ఫలితాలు అందుబాటులో ఉంటాయ ని తద్వారా పేదలకు ఎంతో మేలు కలుగుతుందన్నారు. పరీక్షా కేంద్రాలకు వెళ్లలేని వారికి పీహెచ్సీలోనే నమూనాలను సేకరించి రోగ నిర్దారణ చేస్తారన్నారు. మాజీ కార్పొరేటర్లు పగడాల బాబూరావు, తూము శ్రవణ్కుమార్, మేడ్చల్ జిల్లా మైనార్టీ అధ్యక్షుడు గౌసుద్దీన్, ఆరోగ్య కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.