అంబర్పేట, ఏప్రిల్ 28: కష్టకాలంలోనూ ప్రభుత్వం ప్రజలకు అండగా ఉందని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. కరోనా వైరస్ జోరుగా విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో కూడా ఆడ పడచులకు అండగా నిలవాలని వారికి షాదీముబారక్ చెక్కులను అందజేస్తున్నదని చెప్పారు. అంబర్పేట నియోజకవర్గంలో 93 మందికి షాదీ ముబారక్ చెక్కులు మంజూరయ్యాయి. కరోనా నేపథ్యంలో మంజూరైన వాటిలో రోజుకు కొంత మందికి ఇవ్వాలని రెవెన్యూ అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా బుధవారం స్థానిక మండల కార్యాలయంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ 14 మందికి చెక్కులు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంబర్పేట నియోజకవర్గంలో షాదీముబారక్తో పాటు సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరైన చెక్కులను కూడా అందజేస్తున్నామన్నారు. ప్రభుత్వం ద్వారా అమలవుతున్న అన్ని సంక్షేమ, అభివృద్ధి పథకాలు అర్హులైన వారికి అందేలా గట్టి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి బస్తీ, కాలనీల్లో రోడ్లు, మంచినీరు, డ్రైనేజీ పైపులైన్ల ఏర్పాటు, వీధి దీపాల ఏర్పాటు వంటి అభివృద్ధి పథకాలను చేపట్టామని చెప్పారు. రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.