అంబర్పేట, జూన్ 28: నియోజకవర్గ వ్యాప్తంగా వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చేపడుతున్నామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన పనులు వేగవంతం చేశామని వెల్లడించారు. ఆదివారం ఒక్కసారిగా కురిసిన భారీ వర్షానికి నీట మునిగిన నల్లకుంట డివిజన్ పాతరామాలయం ప్రాంతాన్ని ఆయన సోమవారం పరిశీలించారు. ముంపునకు గల కారణాలను ఆయన తెలుసుకున్నారు. కెనరా బ్యాంక్ వీధి నంబర్ 14తో పాటు రామాలయం వీధిలో పాదయాత్ర చేసి పరిస్థితిని సమీక్షించారు. వెంటనే నిలిచిపోయిన వరదనీరు సజావుగా వెళ్లేందుకు చర్యలు తీసుకున్నారు. అనంతరం సమస్య శాశ్వత పరిష్కారం కోసం మరమ్మతుల్లో భాగంగా ఫీవర్ దవాఖాన చౌరస్తాలోని కెనరా బ్యాంకు వద్ద వేసిన పెద్ద నాలాకు అనుసంధానం చేసిన చిన్న పైప్లైన్లతో ముంపు సమస్య జటిలమవుతోందని నల్లకుంట వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు వినతి పత్రం అందజేసి సమస్యను వివరించారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులతో పాటు నల్లకుంట వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు రామకృష్ణరావు, బాలకృష్ణారెడ్డి, మోహన్నాయుడు, వీరయ్య, పి.శ్రీనివాస్రావు, నాయకులు రితేశ్, ప్రశాంత్, రమణ, అమర్నాథ్, అశోక్బాబు, సంజీవ్, వినోద్, వేణుగోపాల్, అజయ్కుమార్రెడ్డి, జితేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.