ఎల్బీనగర్, మార్చి 28: ఎల్బీనగర్ నియోజకవర్గాన్ని ఓ విజన్తో అభివృద్ధి చేశామని, ప్రధాన సమస్యలను సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో పరిష్కరించామని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. మంగళవారం ఎల్బీనగర్ నియోజకవర్గం లింగోజిగూడ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం కర్మన్ఘాట్ కొత్తకాపు యాదవరెడ్డి గార్డెన్లో జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్రెడ్డి మాట్లాడుతూ… నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి వాట్సాప్ నాయకులకు తెలియదని, దీంతో అవాకులు, చెవాకులు పేలుతున్నారని విమర్శించారు. ఎల్బీనగర్ అభివృద్ధి పై ప్లానింగ్ లేని నాయకులు ఏమీ తోచక విమర్శలు చేస్తున్నారని, అలాంటి వారికి తాను చేసిన అభివృద్ధి పై చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఎన్నికల్లో ఇచ్చిన హమీలన్నింటిని నెరవేర్చానని, ఆటోనగర్ డంపింగ్ యార్డును బోటానికల్ గార్డెన్గా మార్చే పనులు కూడా మరో నెల రోజుల్లో ప్రారంభం అవుతాయన్నారు. నియోజకవర్గాన్ని రూ. 3వేల కోట్లతో ప్రగతిపథంలో తీసుకెళ్తున్నామన్నారు. రూ.1200 కోట్లతో టిమ్స్ ఆసుపత్రి, రూ.120 కోట్లతో మంచినీరు, రూ. 150 కోట్లతో యూజీడీ పనులు, రూ. 658 కోట్లతో ఎస్ఆర్డీపీ, రూ. 113 కోట్లతో ఎస్ఎన్డీపీ పనులు, రూ.25 కోట్లతో పార్కులు, రూ.23 కోట్లతో ఫతుల్లగూడలో మూడు మతాలకు చెందిన శ్మశాన వాటికలు, రూ. 23 కోట్లతో ఆటోనగర్లో బస్బే , రూ. 7 కోట్లతో ఏడు మైదానాలు అభివృద్ధి చేసేందుకు ముందుకు సాగుతున్నామన్నారు. అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేయడంతో తెలంగాణ దేశంలోనే నంబర్వన్గా ఉన్నదన్నారు. ఎల్బీనగర్ గడ్డపై బీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే శ్రీకాంతాచారి త్యాగానికి నిజమైన నివాళి అని పేర్కొన్నారు.
అభివృద్ధికి చిహ్నంగా ఎల్బీనగర్ మారిందని ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్త అన్నారు. బీఆర్ఎస్ పార్టీని అఖండ మెజార్టీతో గెలిపించాలన్నారు. కార్యకర్తలంతా కలిసికట్టుగా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాస్రావు, పరిశ్రమల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ అమరవాది లక్ష్మీనారాయణ, డివిజన్ అధ్యక్షుడు వరప్రసాద్రెడ్డి, మాజీ అధ్యక్షుడు తిలక్, నర్సింహ, శ్రీనివాస్ కురుమ, భాస్కర్, శ్రీధర్ గౌడ్, మధుసూదన్రెడ్డి, ఇంద్రాజీలతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.