ఎల్బీనగర్, జూన్ 3: ప్రజలకు సేవ చేసే భాగ్యం అందరికీ రాదని.. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో డాక్టర్లు, ఆస్పత్రుల యాజమాన్యాలు ఫీజులు తగ్గించి కొవిడ్ రోగులకు మెరుగైన సేవలు అందించాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. గురువారం ఎల్బీనగర్ నియోజకవర్గంలోని వైద్యశాలల యజమానులు, సీఈవోలు, జిల్లా అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనాను అరికట్టడంలో వైద్యుల పాత్ర కీలకమని అన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడుతున్న వైద్యశాలలు బిల్లులు మాత్రం ఇష్టారాజ్యంగా వసూలు చేయడం దారుణమన్నారు. కొన్ని ఆస్పత్రులైతే ఏకంగా రోగులకు బిల్లు కట్టే స్థోమత ఉందా లేదా అని తెలుసుకొని చేర్చుకుంటున్నారని అన్నారు. వైద్యశాలల వద్ద ప్రభుత్వ నిబంధనల మేరకు వసూలు చేసే ఫీజుల ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలన్నారు. రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ మాట్లాడుతూ కొందరి ఆస్పత్రుల దోపిడీతో అందరికీ చెడ్డ పేరు వస్తుందన్నారు. ఎల్బీనగర్ డీసీపీ సన్ప్రీత్ సింగ్ మాట్లాడుతూ ప్రైవేట్ ఆస్పత్రుల విషయంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి తీసుకుంటున్న చొరవను అభినందించారు. ఈ సందర్భంగా ఆస్పత్రుల యజమానులు ఎమ్మెల్యే సుధీర్రెడ్డి సూచన మేరకు బిల్లులు తగ్గించేందుకు అంగీకరించారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా వైద్యారోగ్య అధికారి స్వరాజ్యలక్ష్మి, డిప్యూటీ డీఎంహెచ్ఓ దీన్దయాల్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నరేందర్రెడ్డి, డాక్టర్ అల్వాల్రెడ్డి, డాక్టర్ భాస్కర్, ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్రెడ్డి, సీఐలు అశోక్రెడ్డి, సీతారాంతో పాటు ఆస్పత్రుల యజమానులు, డాక్టర్లు పాల్గొన్నారు.