మన్సూరాబాద్, మే 8 : నాగోల్ చెరువులో పెరిగిన గుర్రపు డెక్క తొలిగింపు ప్రక్రియను వేగవంతం చేయాలని ఎంటమాలజీ అధికారులను ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి ఆదేశించారు. నాగోల్ చెరువులో పేరుకుపోయిన గుర్రపు డెక్క తొలిగింపు ప్రక్రియను శనివారం ఎంటమాలజీ అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యే మాట్లాడు తూ.. సుమారు 14 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువులో గుర్రపు డెక్క పెరగడం వల్ల దోమలు విపరీతంగా వృద్ధి చెందే అవకాశం ఉందని తెలిపారు. దోమల నివారణకు ఒకవైపు చర్యలు తీసుకుంటూనే మరోవైపు గుర్రపుడెక్క తొలిగింపు పనులను నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. దోమలు ఉత్పత్తి కాకుండా ఉండేందుకు గాను లా ర్వా దశలోనే నిర్మూలించేందుకు చెరువులో స్ప్రే చేయిస్తున్నామని అన్నారు. చెరువులో మురుగునీరు చేరడం వల్ల గుర్రపుడెక్క పెరుగుతుందని.. ఈ చెరువులోకి మురుగునీరు చేరకుండా పటిష్టమైన చర్యలు చేపడుతామని ఆయన తెలిపారు. ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా చెరువును సుందరీకరిస్తామని పేర్కొన్నారు.