ఎల్బీనగర్, ఆటోనగర్ ప్రధాన రహదారి పక్కన నూతనంగా నిర్మించ తలపెట్టిన అంతర్జాతీయ స్థాయి బస్ టెర్మినల్ విషయంపై శనివారం అరణ్యభవన్లోని అటవీ సంరక్షణ ముఖ్యాధికారి (ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్) ఆర్. శోభ, చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిలతో ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి సమావేశమయ్యారు. ఆటోనగర్లో నూతనంగా నిర్మించతలపెట్టిన బస్ టెర్మినల్ ఆవశ్యకతను ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అధికారులకు వివరించారు. ఎల్బీనగర్ రింగ్రోడ్డులో ఇప్పటికే ఫ్లైఓవర్ నిర్మించినందున అక్కడ జిల్లాలకు వెళ్లే బస్సులను నిలపడం వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని ఆయన అధికారులకు వివరించారు.
అంతర్జాతీయ స్థాయిలో నిర్మించ తలపెట్టిన బస్ టెర్మినల్ ఏర్పాటు పనుల విషయంలో జాప్యం జరుగకుండా చూడాలని ఎమ్మెల్యే సుధీర్రెడ్డి అధికారులను కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి మాట్లాడుతూ బస్ టెర్మినల్ నిర్మాణ పనులను త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. త్వరితగతిన అనుమతులు మంజూరు చేస్తే ఆసియాలోనే అత్యున్నత స్థాయిలో సకల సదుపాయాలతో బస్ టెర్మినల్ను నిర్మిస్తామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో నంబర్వన్ బస్ టెర్మినల్గా రూపొందిస్తామని.. రాబోయే రెండు నెలల్లో పనులు ప్రారంభిస్తామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.