బంజారాహిల్స్, మార్చి 6: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ద్వారా రాష్ర్టానికి చేస్తున్న అన్యాయాలను పట్టభద్ర ఓటర్లు నిశితంగా గమనిస్తున్నారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ద్వారా బీజేపీకి గుణపాఠం నేర్పిస్తారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. శనివారం ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నియమించిన టీఆర్ఎస్ ఏజెంట్ల సమావేశంలో నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ర్టానికి రావాల్సిన నిధులను ఇవ్వకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోందన్నారు. ఇటీవల కాజీపేటలో ఏర్పాటు చేయాల్సిన కోచ్ ఫ్యాక్టరీని రద్దు చేశారన్నారు. బీజేపీ నాయకులకు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని, పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను విపరీతంగా పెంచి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న బీజేపీ ప్రభుత్వం పనితీరును పట్టభద్రులు గమనిస్తున్నారన్నారు. అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బలపర్చడం అందరి బాధ్యతన్నారు. విద్యావంతురాలైన సురభి వాణీదేవీని గెలిపించాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. పట్టభద్ర ఓటర్లను నేరుగా కలిసి పార్టీ చేపట్టిన అభివృద్ధిని వివరించాలని సూచించారు.
ఖైరతాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవి గెలుపును కాంక్షిస్తూ శనివారం సాయంత్రం కార్పొరేటర్ వనం సంగీతయాదవ్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. పట్టభద్రుల ఇంటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. ఆమె వెంట టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు ఎస్కే అహ్మద్, నాయకులు సలావుద్దీన్, శ్రీనివాస్, మూర్తి తదితరులు ఉన్నారు.
శ్రీనగర్కాలనీ: యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపర్చడంతో పాటు ఉద్యోగుల ప్రయోజనాలకు ప్రాధాన్యమిచ్చే టీఆర్ఎస్కు మద్దతునివ్వాలని కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి కోరారు. శనివారం వెంకటేశ్వరకాలనీ డివిజన్ పరిధిలోని ఇబ్రహీంనగర్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవిని భారీ మెజార్టీతో గెలిపించాలని పట్టభద్రులను, ఉద్యోగులను కోరారు. అదే విధంగా ఫిలింనగర్లో జరిగిన బూత్స్థాయి ఏజెంట్ల సమావేశానికి డివిజన్ నుంచి పెద్దసంఖ్యలో టీఆర్ఎస్ నాయకులు తరలివెళ్లారు. దేవరకొండ బస్తీలో పట్టభద్రుల ఓటర్ల వద్దకు టీఆర్ఎస్ నాయకులు వెళ్లి ఓటరు జాబితాలోని వారికి స్లిప్పులను అందజేశారు.